
ప్రేమ కథా చిత్రాలను ఆదరిస్తారు!
తమిళసినిమా: కథానాయకుడిగా, నిర్మాతగా మంచి చిత్రాలను చేస్తూ రాణిస్తున్న నటుడు విష్ణు విశాల్. కాగా ఈయన తాజాగా తన విష్ణు ప్రసాద్ స్టూడియోస్ పతాకంపై రోమియో పిక్చర్స్ రాహుల్తో కలిసి నిర్మించిన చిత్రం ఓహో ఎందన్ బేబీ. ఈ చిత్రం ద్వారా తన తమ్ముడు (పెదనాన్న కొడుకు) రుద్రను కథానాయకుడిగా పరిచయం చేశారు. నటి మిధుల పాల్కర్ నాయకిగా నటించిన ఇందులో అంజుకురియన్, దర్శకుడు మిష్కిన్, బాలాజీ శక్తివేల్,కరుణాకరన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ వాణిజ్య ప్రకటనలు దర్శకుడు, నటుడు కష్ణ కుమార్ రామ్ కుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. జెన్ మార్టిన్ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని జూలై 11వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం చిత్రం ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక రాయపేటలోని పీవీ ఆర్ సత్యం థియేటర్లో నిర్వహించారు. కార్యక్రమంలో నటుడు కార్తీ, దర్శకుడు వెట్రిమారన్, రామ్ కుమార్, అశ్వద్ మారిముత్తు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు విష్ణు విశాల్ రుద్ర తన పెదనాన్న కొడుకు అని చెప్పారు. తాను నటుడు కావడానికి తన పెదనాన్న ప్రోత్సాహమేనని పేర్కొన్నారు. ఇప్పుడు తన తమ్ముడు రుద్రను తాను కథానాయకుడిగా పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మాట్లాడుతూ కుటుంబం గురించి తెలియగానే తనకు వానత్తుపోల్ చిత్రం గుర్తుకు వచ్చిందన్నారు. తాను హీరోగా పరిచయమైనప్పుడు కుటుంబ సభ్యులంతా ఎంతగానో అండగా నిలిచారన్నారు. కాగా ఓహో ఎందన్ బేబీ చిత్ర ట్రైలర్ పాటలను చూస్తే ఇది మంచి ప్రేమ కథ చిత్రం గా ఉంటుందని తెలుస్తోందన్నారు. ఇలాంటి ప్రేమ కథా చిత్రాలనే ఇప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు నటుడు కార్తీ పేర్కొన్నారు.