
శరవేగంగా రోడ్డు విస్తరణ పనులు
తిరుత్తణి: తిరుత్తణి– చిత్తూరు రోడ్డు విస్తరణ తొలిదశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తమిళనాడులోని తిరుత్తణి నుంచి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు పట్టణానికి ప్రస్తుతం రెండు లేన్ల రహదారి ఉంది. వాహనాల రద్దీతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకోవడంతో రోడ్డు విస్తరణకు హైవే శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీంతో సీఎం రహదారుల విస్తరణ పథకంలో భాగంగా తొలి దశలో తిరుత్తణి హైవేశాఖ ఆధ్వర్యంలోని తలయారితాంగల్ నుంచి బీరకుప్పం వరకు నాలుగు కిలోమీటర్ల దూరం నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ. 26 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం రోడ్డుకు ఇరువైపుల చెట్లు నరికి రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. ఇరువైపులా రోడ్డు విస్తరించి మధ్యలో సెంటర్ మీడియన్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. అలాగే పళ్లిపట్టు హైవేశాఖ ఆధ్వర్యంలోని ఎరుంబి నుంచి గోపాలపురం వరకు ఐదు కిలో మీటర్లల దూరం తొలివిడతలో రూ.35 కోట్లు వ్యయంతో రోడ్డు విస్తరణ పనులు జగుతున్నాయి. హైవేశాఖ అధికారులు సమక్షంలో పనులు వేగంగా నిర్వహిస్తున్నట్లు, మరో నెల రోజుల్లో నాలుగు లేన్ల రహదారి పనులు పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు.