
14 నుంచి నిరవధిక సమ్మె
తిరువళ్లూరు: రేషన్ దుకాణ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చని పక్షంలో జూలై 14వ తేదీ నుంచి నిరవదిక సమ్మెకు దిగుతామని ఉద్యోగులు ప్రకటించారు. తమిళనాడు రాష్ట్ర ప్రాథమిక సహాకార సంఘం ఆధ్వర్యంలో రేషన్ దుకాణాలు నడుస్తున్నాయి. ఈ దుకాణాల ద్వారా నిరుపేదలకు బియ్యం, పప్పులు, నూనె తదితర వస్తువులు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల నిత్యావసర వస్తువులను అందించే సమయంలో కొత్త నిబంధనలను పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త ఉత్తర్వులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆరోపిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తొలిదశ ఆందోళనలో భాగంగా తిరువళ్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ ఆందోళన కార్యక్రమానికి సంఘం జిల్లా అధ్యక్షుడు మురుగేషన్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి త్యాగరాజన్ హాజరై, ప్రసంగించారు. మాట్లాడుతూ నిత్యావసర వస్తువులను అందించే సమయంలో బ్లూటూత్ను త్రాసుకు అనుసంధానం చేయాలన్న విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. గోడౌన్ నుంచి సరుకులు బయటకు వచ్చే సమయంలో తూకం సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెలవు దినాల్లో ఉద్యోగులకు ఇస్తున్న వేర్వేరు పనులను రద్దు చేయాలని కోరారు. సేల్స్మెన్ విద్యార్హత ఆధారంగా ఉద్యోగోన్నతి కల్పించాలని కోరారు. సేల్స్మెన్లను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయవద్దని కోరారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో జూలై 14వ తేదీ నుంచి విధులను బహిష్కరించి సామూహిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నేతలు మారీ, నూర్మహ్మాద్, జయచంద్రన్, మేగనాథన్, పొన్నన్ తదితరులు పాల్గొన్నారు.