
డీఎంకే ప్రభుత్వానికి స్వస్తి పలకాలి
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా స్టిక్కర్ రాజకీయాలు చేస్తున్న డీఎంకే ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు స్వస్తి పలకాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అశ్వథామన్ అన్నారు. శుక్రవారం ఉదయం వేలూరులోని ప్రైవేటు హోటల్లో ఆ పార్టీ జిల్లా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేలూరులోని పెట్ల్యాండ్ ప్రభుత్వాస్పత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు ఇచ్చిందన్నారు. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఆస్పత్రిని నిర్మించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి చంకలు గుద్దుకోవడం సరికాదన్నారు. ఆస్పత్రిని ప్రారంభించినప్పటికీ అందులో రోగులకు ఎటువంటి సౌకర్యం కల్పించలేదన్నారు. వీటిపై ఎడపాడి పళణిస్వామి చెప్పడంతో ఇందుకు బాధ్యత గల ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ నేరుగా ఆస్పత్రిని చూసి మాట్లాడాలని విలేకరులతో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం పర్యటన రోజున కాట్పాడి నుంచి వేలూరు వరకు పార్టీ జెండాలను కట్టి ట్రాఫిక్ను స్తంభింప జేసి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. అయితే బీజేపీ జెండాలు కట్టకూడదని తమ పార్టీ జిల్లా అధ్యక్షులపై పోలీసులు కేసులు నమోదు చేస్తామని బెదిరించడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ నిధుల్లో కుంభకోణం జరిగిందని నిధులను నిలిపి వేశారని దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దశరథన్, కార్యదర్శి శరవణన్, ప్రతినిధులు కుమరన్, జగన్నాథన్, కార్యకర్తలు పాల్గొన్నారు.