
● రాష్ట్రవ్యాప్త పర్యటనకుపళణి సన్నద్ధం ● జూలై 2వ వారం న
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేను మరింత బలోపేతం దిశగా ప్రత్యేక వ్యూహాలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళని స్వామి పదును పెట్టిన విషయం తెలిసిందే. 2026 ఎన్నికలలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్న కాంక్షతో ఉన్న ఆయన పార్టీ వర్గాలతో మమేకం అయ్యే విధంగా, ప్రజలకు మరింత చెరువయ్యే దిశగా మున్ముందు కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తరచూ పార్టీ నేతలతో చైన్నెలో సమావేశాలు నిర్వహిస్తూ, పలు సూచనలు సలహాలు ఇస్తూ వస్తున్నారు. తాజాగా బీజేపీతో జత కట్టిన నేపథ్యంలో 2026లో అధికారం లక్ష్యంగా పార్టీ వర్గాలకు ఉరకలు తీయించే విధంగా వేగాన్ని పెంచారు. ఇందులో భాగంగా మంగళవారం కొన్ని జిల్లాల కార్యదర్శులతో భేటీ అయ్యారు. రెండవ రోజుగా బుధవారం తిరుచ్చి, మదురై, నాగపట్నం, తంజావూరు, కోయంబత్తూరు, సేలం, తిరుప్పూర్, నీలగిరి, తదితర జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నేతలు ఇన్చార్జ్లతో సమావేశం అయ్యారు.
పర్యటనకు రెడీ..
తొలిరోజు సమావేశంలో పలు సూచనలు, పార్టీ పరంగా కార్యక్రమాలను వేగవంతం చేసే విధంగా నేతలకు పళణిస్వామి ఆదేశాలు ఇచ్చారు. అలాగే బూత్ కమిటీల ఏర్పాటులో జాప్యం చేస్తున్న కొన్ని జిల్లాల కార్యదర్శులకు త్వరితగతిన పనులు ముగించే విధంగా హెచ్చరికలు చేశారు. రెండవ రోజు జరిగిన సమావేశంలో తన రాష్ట్ర పర్యటనకు సంబంధించిన సంకేతాన్ని నేతల్లోకి పళణి తీసుకెళ్లినట్టు రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎంజీఆర్ మాళిగై వర్గాలు పేర్కొంటున్నాయి. జూలై 2వ వారం నుంచి తన రాష్ట్ర పర్యటన ఉంటుందని, ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధమైనట్టు సూచించారు. అంతలోపు నేతలందరూ నియోజకవర్గాలల్లోకి వెళ్లాలని, ప్రజల సమస్యలపై అధ్యయనం చేసుకోవాలని వివరించినట్టు ఓ నేత పేర్కొన్నారు. ప్రధానంగా తన పర్యటన నియోజకవర్గాల వారీగా సాగుతుందని, కేవలం సభలకే పరిమితం కాకుండా, మహిళా సంఘాలు, యువతతో చర్చలు, సమావేశాల దిశగా సైతం ఏర్పాట్లు చేయాలన్న సూచనను పళణి ఇచ్చినట్టు పేర్కొంటున్నారు. రాష్ట్ర పర్యటన విజయవంతం అయ్యే విధంగా ఏర్పాట్లు ఉండాలని, జనం స్వచ్ఛందంగా తరలి వచ్చే విధంగా ప్రజలతో మమేకం అవుతూ ముందుకు వెళ్లాలని నేతలుకు పళణి స్వామి సూచించినా, తొలి పర్యటన అన్నది దక్షిణ తమిళనాడులో ప్రధాన కేంద్రంగా ఉన్న మదురై నుంచి సాగేనా లేదా కొంగు మండలంలో ప్రధాన నగరంగా ఉన్న కోయంబత్తూరు నుంచి మొదలెట్టేనా అన్నది తేలాల్సి ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికలలో పది అసెంబ్లీ స్థానాలలో తొమ్మిదింటిని తమకు అందించిన కోయంబత్తూరు జిల్లా నుంచే తన పర్యటనకు పళణి నిర్ణయించినా, దక్షిణ తమిళనాడు మీద దృష్టి పెట్టే విధంగా మధురై ను సైతం వేదికగా ఎంపిక చేసుకుని ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రూట్మ్యాప్ సిద్ధమైన నేపథ్యంలో సమగ్ర వివరాలను జూలై మొదటి వారంలో వెలువడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
నియోజకవర్గాల వారీగా..
ఒక్కో నియోజకవర్గంలో రెండో చోట్ల పది నుంచి పదిహేను నిమిషాలు ప్రసంగించే విధంగా, మరో పది నిమిషాలు ప్రజల సమస్యలు, విజ్ఞప్తులు స్వీకరించేందుకు సమయం కేటాయిస్తూ రూట్ మ్యాప్ రూపకల్పన జరిగినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయా నియోజకవర్గాల పరిధిలో తొమ్మిది మందిచొప్పునయువ నాయకులను ఎంపిక చేసి, వారి ద్వారా వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేసి, స్థానికంగా ఉన్న సమస్యలన్నీ తన దృష్టికి చేరే విధంగా పళణి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నట్టు చెబుతున్నారు. అయితే పళణి పర్యటన మొత్తం ప్రచార వాహనం ద్వారా సాగబోతున్నట్టు, సభలు, సమావేశాలు, వినూత్న తరహాలో ఉంటాయని ఆ పార్టీ నాయకులు పేర్కొంటుండడం గమనార్హం.

● రాష్ట్రవ్యాప్త పర్యటనకుపళణి సన్నద్ధం ● జూలై 2వ వారం న