
నాతో ఉన్న వారికే సీట్లు!
● రాందాసు స్పష్టీకరణ
సాక్షి, చైన్నె: తన వెన్నంటి ఉన్న వాళ్లకే ఎన్నికలలో పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తూ సీట్లు ఇవ్వడం జరుగుతుందని పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు స్పష్టం చేశారు. తన వద్దే పార్టీ పరంగా అన్ని అధికారాలు ఉన్నాయని తేల్చి చెప్పారు. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య సాగుతున్న ధారావాహిక సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్బుమణి వెన్నంటి కొత్త , యువ సమూహం ఉండగా, రాందాసుతో వన్నియర్ సంఘాలతో పాటుగా పార్టీ సీనియర్లు, అనుభవజ్ఞులు ఉన్నారు.ఈ పరిస్థితులలో అన్బుమణి వెన్నంటి ఉన్న వాళ్లను తన వైపు తిప్పుకునే వ్యూహంతో బుధవారం రాందాసు వ్యాఖ్యలు చేశారు. వివరాలు.. పీఎంకేలో పార్టీ పరంగా 78 జిల్లాల ఉన్నాయి. ఇందులో 61 జిల్లాలకు కొత్త అధ్యక్షులు, 78 జిల్లాలకు కొత్త కార్యదర్శులను రాందాసు నియమించారు. అయితే, తొలగించిన వాళ్లంతా పార్టీ పదవులలో కొనసాగుతారని అన్బుమణి స్పష్టం చేశారు. ఇందుకు చెక్ పెడుతూ , పదవుల నుంచి తొలగించ బడ్డ వారికి ఎన్నికలలో సీట్లు లేవు అని, తనతో ఉన్న వాళ్లకే సీట్లు అని స్పష్టం చేస్తూ రాందాసు బుధవారం తైలాపురంలో మీడియాతోమట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. కొత్తగా నియమించిన వారితో సమావేశంలో భాగంగా రాందాసు మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 2026 ఎన్నికలలో కూటమి ఎవరితో అన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికలలో కూటమి ఎవరితో, భిన్నమైన కూటమితోనా అన్నది త్వరలో ప్రకటిస్తామన్నారు. తాను పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శి, కొత్త కోశాధికారి తదితరులతోపాటుగా జిల్లాల పదవులకు నియమాకాలు చేశానని వివరించారు.ప్రస్తుతం తనతో ఎవ్వరెవ్వరు ఉన్నారో వారికే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కల్పిస్తూ సీటు కేటాయించడం జరుగుతుందన్నారు. పార్టీ పరంగా అన్ని అధికారాలు తన వద్దే ఉన్నాయని, తాన నిర్ణయమే సుప్రీం అని స్పష్టం చేశారు. మదురైలో జరిగిన మురుగన్ మహానాడులో అన్నా, పెరియార్లను కించ పరిచే విధంగా లఘుచిత్రం ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎవ్వర్నీ కించ పరచకుండా వ్యవహరించాల్సి ఉండాల్సిందని, అయితే, తప్పు చేశారని వ్యాఖ్యానించారు.