
మహిళలపై దాడి చేసిన హెడ్ కాన్స్టెబుల్ అరెస్టు
తిరుత్తణి: పోలీస్ స్టేషన్లో మహిళలపై దాడి ఘటనకు సంబంధించి హెడ్ కాన్స్టేబుల్ను ఎస్పీ సస్పెండ్ చేయడంతో పాటూ బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కనకమ్మసత్రంకు చెందిన మధుమిత(35)తో పాటు చెవ్వంది(29), ధనం(25) అనే ముగ్గురు మహిళలు అద్దె ఇంట్లో ఐదేళ్ల నుంచి ఒక్కటిగా వుంటున్నారు. ఇందులో మధుమితకు అరుల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం వున్నట్లు తెలుస్తోంది. అయితే మధుమిత తనను తరుచూ వేధిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నట్లు అరుల్ కనకమ్మసత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న మధుమిత అమెతో పాటూ ఉంటున్న మరో ఇద్దరు మహిళలు పోలీస్ స్టేషన్ చేరుకుని అరుల్ అతని మిత్రుడు శివాజీతో వాగ్వాదానికి దిగారు. ఈకర్మంలో హెడ్ కాన్స్టేబుల్ రామన్ మహిళలపై చేయి వేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమపై హెడ్ కాన్స్టేబుల్ దాడిచేసినట్లు గాయాలైనట్లు తిరుత్తణి ప్రభుత్వాసుపత్రిలో చేరి చికిత్స పొందారు. స్టేషన్లో మహిళలపై దాడి ఘటనకు సంబంధించి మధుమిత ఫిర్యాదు మేరకు హెడ్ కాన్స్టుబుల్ రామన్ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ శ్రీనివాస పెరుమాళ్ మంగళవారం ఆదేశించారు. దీంతో కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదు చేసి హెడ్ కాన్స్టేబుల్ను బుధవారం అరెస్టు చేశారు. అదే సమయంలో అరుల్ ఫిర్యాదు మేరకు మధుమిత పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.