
క్లుప్తంగా
బారికేడ్ను ఢీకొన్న బైక్
● సబ్ ఇన్స్పెక్టర్ మృతి
అన్నానగర్: బారికేడ్ను బైక్ ఢీకొని, సబ్ఇన్స్పెక్టర్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..
విరుదునగర్ జిల్లాలోని అరుప్పుకోట్టైకి చెందిన విజయకుమార్ (52) అరుప్పుకోట్టై అసిస్టెంట్ సూపరింటెండెంట్ కార్యాలయంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీస్లో స్పెషల్ సబ్–ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. ఈ స్థితిలో కేసు దర్యాప్తు కోసం మంగళవారం అతను బైకులో మధురైకి వచ్చాడు. తరువాత, అతను మధురై నుంచి అరుప్పుకోట్టై వైపు వెళుతున్నాడు. కరియాపట్టి సమీపం మధురై–తూత్తుకుడి జాతీయ రహదారిపై ఎస్.కల్లుపట్టి బైపాస్ వద్దకు చేరుకుంటుండగా, విజయకుమార్ నడుపుతున్న బైకు అకస్మాత్తుగా రోడ్డుపై ఉంచిన ఇనుప బారికేడ్ను ఢీకొన్నాడు. దీంతో అతడు కిందపడి తీవ్రంగా గాయపడి మరణించాడు.
ట్రాక్టర్ చక్రంలో చిక్కుకుని బాలుడి మృతి
అన్నానగర్: తండ్రి నడుపుతున్న ట్రాక్టర్ చక్రంలో చిక్కుకుని ఓ బాలుడు మృతి చెందాడు. తిరుపత్తూరు జిల్లా నాట్టరంపల్లి సమీపం నాయనసెరువు ప్రాంతానికి చెందిన అరుళ్ ప్రకాశం, సంగీత దంపతులకు ఒకటిన్నరేళ్ల కరణ్ శర్మ కుమారుడు ఉన్నాడు. బుధవారం అరుళ్ ప్రకాశం తన పొలం దున్నడానికి ట్రాక్టర్ తీసుకుని బయలుదేరాడు. ఆ సమయంలో, అతని ఒకటిన్నర ఏళ్ల కుమారుడు కరణ్ శర్మ ట్రాక్టర్ వెనుక ఉన్నాడని గమనించకుండా దాన్ని స్టార్ట్ చేసి, వెనక్కి తీశాడు. దీంతో బాలుడు ట్రాక్టర్ వెనుక చక్రంలో ఇరుక్కుపోయి తలకు తీవ్ర గాయమైంది. ఆ పిల్లవాడిని వెంటనే నాట్టరంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అభివృద్ధి పనుల తనిఖీ
పళ్లిపట్టు: మండపంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ ప్రతాప్ మంగళవారం తనిఖీ చేశారు. పొదటూరుపేట బస్టాండ్లో రూ.1.50 కోట్లు వ్యయంతో సముదాయ భవనంతోపాటు బస్టాండ్ పైకప్పు నిర్మాణ పనులు చేపడుతున్నారు. అలాగే మండలంలోని ఈచ్చంపాడిలో రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టిన చెరువు పూడికతీత పనులు, రూ. 29 లక్షల వ్యయంతో పార్క్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. అనంతరం అత్తిమాంజేరిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ చేసి, వైద్యసేవలకు సంబంధించి రోగులతో మాట్లాడారు. మహిళలు, గర్భిణులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. తరువాత ఆస్పత్రిలో రికార్డులు పరిశీలించారు. రూ. 50 లక్షల వ్యయంతో ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్మిస్తున్న ల్యాబ్ పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణ పంచాయతీల సహాయ డైరెక్టర్ జయకుమార్, పట్టణ పంచాయతీల కార్యదర్శి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.
యువకులకు గుండు గీయించిన ఇన్స్పెక్టర్
కొరుక్కుపేట: విభిన్న హెయిర్స్టైల్ పెట్టుకుని తిరుగుతున్న యువకులకు ఇన్స్పెక్టర్ గుండు గీయించారు. చైన్నె వ్యాసార్పడి ఎంకేబీ నగర్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న బెంజిమ్ మంగళవారం రాత్రి పోలీసులతో కలిసి పెట్రోలింగ్లో ఉన్నాడు. సత్యమూర్తి నగర్ ప్రాంతానికి వెళ్లిన సమయంలో రంగు రంగుల జుట్టు, ఆభరణాలతో ముగ్గురు యువకులను చూశాడు. వారు గందరగోళంగా తిరుగుతుండగా పోలీసులు వారిని ప్రశ్నించి, పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. తరువాత ముల్లైనగర్ ప్రాంతానికి వెళ్లగా అక్కడ విభిన్నమైన హెయిర్ స్టైల్స్ ఉన్న 3 యువకులను చూశారు. వాళ్లని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పోలీసులు అక్కడ ఆరుగురి యువకులకు గుండు గీయించారు. తర్వాత వారిని అక్కడి నుంచి పంపించారు. యువకులకు గుండు చేయించిన ఇన్స్పెక్టర్ బెంజమ్ను వెయిటింగ్ లిస్ట్కు బదిలీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ విషయంపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.
మాధవరం హైవేపై గుంతలు
● నడవలేక ప్రజలకు ఇబ్బంది
కొరుక్కుపేట : మాధవరం టొరెంట్ గ్యాస్ పైప్లైన్ నిర్మాణ సమయంలో హైవేపై గుంతలు తవ్వడం, వాటిని పూడ్చి వేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాధవరం మూలక్కడై నుంచి ఎంఆర్హెచ్ హైవే మీదుగా మాధవరం చిన్న రౌండ్ అబౌట్ 200 అడుగుల రోడ్డుకు వెళ్లే హైవేపై టొరెంట్ గ్యాస్ పైపులైన్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. ఈ కంపెనీ హైవేపై గుంతలు తవ్వి, పైపులు వేసి, వాటిని పూడ్చి వేయకుండా వదిలివేస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ పని రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరగాల్సి ఉంది. అయితే, ఈ పని ఉదయం వేళల్లో ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో నిర్వహించడంతో వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభిస్తోంది. సంబంధిత అధికారులు ఈ రోడ్డులోని గుంతలను పూడ్చాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.