
● మల్టీ మోడల్ సేవకు సన్నద్ధం ● అన్ని రవాణా సేవలకూ ఒకే
సాక్షి, చైన్నె: రాజధాని నగరం చైన్నె విస్తీర్ణం 2026లో పెరగబోతున్న విషయం తెలిసిందే. ఇది వరకు నగరం, సబర్బన్ ప్రాంతాలుగా 1,189 చ.కీమీ విస్తీర్ణంతో ఉన్న ఈ చైన్నె మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఇక 5,904 చదరపు కి.మీ విస్తీర్ణంతో మహా మహానగరంగా జాబితాలోకి చేరింది. చైన్నె, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, రాణిపేట జిల్లా అరక్కోణం ఈ మహా మహానగరం పరిధిలోకి చేర్చారు. అదే సమయంలో చైన్నె నగరం చుట్టూ మెట్రో సేవల కార్యాచరణ వేగవంతం చేసిన అధికారులు పనుల వేగం పెంచారు. అలాగే ఎంటీసీ బస్సుల సేవలను, ఎలక్ట్రిక్ రైళ్ల సేవలను వీటికి అనుసంధానించే విధంగా ఒకే టికెట్టుతో మల్టీ మోడల్సేవలకు కార్యాచరణ సిద్ధం చేశారు.
ప్రయాణికుల సౌకర్యార్థం..
రాజధాని నగరం చైన్నెలో ప్రధాన రవాణా వ్యవస్థలుగా చెంగల్పట్టు నుంచి బీచ్ వరకు, సెంట్రల్ నుంచి అర్కోణం , గుమ్మిండి పూండి వైపుగా ఎలక్ట్రిక్ రైళ్ల సేవలు , బీచ్ నుంచి వేళచ్చేరి వరకు ఎంఆర్టీఎస్ రైలు సేవలు చైన్నెలో ఇప్పటికే ఉంది. ఇటీవల విమానాశ్రయం నుంచి కోయంబేడు – సెంట్రల్ మీదుగా విమ్కో నగర్కు ఓ మార్గం, సెయింట్ థామస్ మౌంట్ నుంచి ఆలందూరు మీదుగా అన్నా సాలై వైపుగా సెంట్రల్కు మారో మార్గంలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో ఎంఆర్టీఎస్ సేవలు మరికొన్ని నెలలలో వేళచ్చేరి నుంచి సెయింట్ థామస్ మౌంట్ వరకు పట్టాల మీదకు రానున్నాయి. ఇక, మెట్రో సేవలు చైన్నె నగర శివారులోని నలు దిశలను చుట్టే విధంగా కీలాంబాక్కం, సిరుచ్చేరి మాధవరం, పుందమల్లి – ఆవడి – పరందూరు వరకు విస్తరించే విధంగా పనుల వేగం పెంచారు. కొన్ని మార్గాలలో ఈ ఏడాది చివర్లో ,మరికొన్ని మార్గాలలో 2027 మార్చి నాటికి పనులు ముగించే విధంగా కార్యాచరణ సిద్దంచేశారు. నగరానికి నలుదిశలలో మెట్రో ప్రయాణమే కాదు, ఇతర రకాలా రవాణా వ్యవస్థను సులభతరం చేయడమే లక్ష్యంగా చైన్నె మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ పర్యవేక్షణలో (సీఎండీఏ) కంబైన్డ్ ట్రాన్స్ పోర్టు అథారిటీ రంగంలోకి దిగింది. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్లను ఏకీకృతం చేస్తూ, అన్ని సేవలకు ఒకే టికెట్టు అన్న నినాదంతో ముందుకెళ్లేందుకు సిద్ధమైంది.
జూలైలో
అందుబాటులోకి..
ఒకే గూటిలోకి అన్ని రవాణా సేవలను తీసుకొచ్చేందుకు కసరత్తులను కంబైన్డ్ ట్రాన్స్ పోర్టు అథారిటీ ప్రస్తుతం పూర్తి చేసింది. ఒకే టికెట్టుతో పైన అన్ని రకాల రవాణా సేవలను ప్రజలు పొందేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఆయా మార్గాలను ఏకం చేయడం, రైల్వేతో అనుసంధానించడం , ప్రయాణికులకు రవాణా మార్గాలను సులభతరం చేయడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఇందు కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను సిద్ధం చేశారు. తద్వారా ప్రయాణ టికెట్టు పొందేందుకు వీలుగా రూట్మ్యాప్తో పాటూ అన్ని రకాల రవాణా సమాచారం, సమయం తదితర వివరాలను ప్రత్యేకంగా ప్రయాణికులకు తెలియజేసేందుకు సిద్ధమవుతోన్నారు. చైన్నె నగరంలో అన్ని రకాల రవాణాలకు సంబంధించిన స్టేషన్ల,స్టాపింగ్లు తదితర సమాచారాలు ఈ యాప్లో పొందు పరుస్తున్నారు. ఈ మేరకు ఒకే టికెట్టు ఆధారంగా మూడు రవాణా సేవలను పొందేందుకు వీలు కల్పించనున్నారు. మొబైల్ యాప్లోని క్యూ ఆర్ కోడ్ ఉపయోగించి టికెట్లను పొందే అవకాశం కూడా కల్పించనున్నారు. మెట్రో స్టేషన్లలో స్కానింగ్ సదుపాయం ద్వారా టికెట్టు పొందేందుకు, ఎంటీసీ బస్సులలో పొందు పరచనున్న క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్ల ద్వారా అప్పటికప్పుడే టికెట్లు పొందేందుకు సైతం వెసులు బాటు కల్పించే విధంగా సమగ్ర వివరాలను ఈ యాప్లో పొందు పరిచినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకే టికెట్టు సేవకు సంబంధించిన సమగ్ర కార్యారణను అధికారులు సిద్ధం చేశారు. జూలైలలో అమల్లోకి తెచ్చే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. అంతకు ముందుగా ప్రయోగాత్మాకంగా యాప్ పరిశోధనకు సిద్ధమయ్యారు. జూలై చివరి నాటికి చైన్నె నగరంలో పూర్తిస్థాయిలో ఒకే టికెట్టుతో కూడిన మల్టీ మోడల్ సేవలను అందరికి దరిచేర్చే దిశగా ఉరకలు తీస్తున్నారు.