
‘సీ–కౌ’ సంరక్షణకు సన్నద్ధం
సాక్షి, చైన్నె: అంతరించి పోతున్న కడల్ పసు (సీ కవ్, సముద్రపు పసువు)లను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. తంజావూరు మనోరా బీచ్లో రూ.15 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన సమగ్ర కార్యాచరణను విడుదల చేశారు. సముద్ర సంపదలను పరిరక్షించే విధంగా, అరుదైన సముద్ర జీవ రాశులను కాపాడుకునే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అంతరించి పోతున్న కడల్ పసువును సంరక్షించే దిశగా, వాటి మీద పరిశోధనలు విస్తృతం చేయడానికి వీలుగా ఓ కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సముద్ర తీరాలలో సుమారు 250 మేరకు సీ కవ్లు ఉన్నాయని, ఇందులో మన్నార్ వలిగుడా, బగ్విరి గుడా వంటి ప్రాంతాలలో వీటి సంచారం అధికంగా ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు. అంతరించి పోతున్న వీటిని రక్షించుకునేందుకు తంజావూరు మనోరా బీచ్లో సంరక్షణ, పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం రూ. 15 కోట్లను విడుదల చేశారు. ఈ నిధులతో పనుల మీద దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఇక్కడ జరగనున్న నిర్మాణాలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ మంగళవారం వెలుగులోకి వచ్చింది.
అంతర్జాతీయ ప్రమాణాలతో..
అంతర్జాతీయప్రమాణాలతో సీ కవ్ సంరక్షణ కేంద్రంతో పాటూ తాబేళ్ల పరిరక్షణకు ప్రత్యేక నిర్మాణాలు ఇక్కడ జరగబోతున్నాయి. మనోరా బీచ్లో మూడు కేటగిరులతో నిర్మాణంకు చర్యలు తీసుకున్నారు. సందర్శకుల కోసం ఓపెన్ ప్రాంతం, అద్దాలతో నిర్మితమైన ప్రాంతం, పూర్తి క్లోజ్డ్ ప్రాంతంగా మూడు కేటగిరీలపై దృష్టి పెట్టి నిర్మాణాలు జరగనున్నాయి.రూ. 15 కోట్లతో ఈ పనులు జరగనున్నాయి. ప్రత్యేక ఆకారంలో కేంద్రం, మ్యూజియం, 4 డీ థియేటర్, పార్కు, ఓపెన్ ఎయిర్ థియేటర్ , రెస్టారెంట్,సెల్పీ పాయింట్, అంటూ బ్రహ్మాండ నిర్మాణాలు జరగబోతున్నాయి.ఈ కేంద్రం ఏర్పాటులో భాగంగా తంజావూరు, పుదుకోట్టై సముద్ర తీర ప్రాంతాలను కలుపుతూ సీ కౌవ్ కన్షర్వేషన్ రిజర్వుగా పరిసరాలను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
సంరక్షణ కేంద్రం నమూనా
తంజావూరులో కేంద్రం
రూ. 15 కోట్లతో పనులు
కార్యాచరణ ప్రణాళిక విడుదల