
హిజ్రాలకు ప్రోత్సాహం
● ఆ రెండు పథకాలలో నిబంధనల సడళింపు
సాక్షి, చైన్నె: పుదుమై పెన్, తమిళ్ పుదల్వన్ పథకాలలో ట్రాన్స్ ఉమెన్, జెండర్ (హిజ్రాల కోసం ) నిబంధనలను సడళిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వ బడులలో చదువుకున్న విద్యార్థినులకు ఉన్నత చదవులలో ప్రోత్సాహంగా నెలకు రూ.1000 నగదు పంపిణీ నిమిత్తం పుదుమైపెన్ పథకం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్లస్–2 ముగిసిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకుంటూ లక్షలాది మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అలాగే, విద్యార్థులకు సైతం ఈ పథకం వర్తింప చేసే విధంగా తమిళ్ పుదల్వన్ అని నామకరణం చేశారు. విద్యార్థులకు ఈ పథకం అమలోయ్యే సమయంలో తమకు వర్తింపు చేయాలని ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలల నుంచి విజ్ఞప్తులు పెరిగాయి. దీంతో ఈ రెండు పథకాలను ప్రభుత్వ , ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులకు అమలు చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో తమకు సైతం వర్తింపు చేయాలని హిజ్రాల నుంచి విజ్ఞప్తులు పెరిగాయి. హిజ్రాల సంక్షేమం దిశగా ప్రభుత్వం బృహత్తర పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో వారిలో ఉన్నత విద్యా ప్రోత్సహం నింపే దిశగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రభుత్వ సహకారం అన్న నిబంధనలను హిజ్రాలకు తొలగించారు. ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ జెండర్ ఏ బడులలోచదువుకున్నా సరే, ఈ పథకాల నిమిత్తం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ సీఎం స్టాలిన్ ఆదేశాలతో మంగళవారం అధికార వర్గాలు ఉత్తర్వులు జారీ చేశారు.