
2027లో సంస్థాగత సమరం
● నియోజకవర్గ నేతలతో స్టాలిన్ విస్తృత భేటీ
సాక్షి, చైన్నె : 2027లో డీఎంకేలో పదవులకు సంస్థాగత సమరం జరగనుంది. దీని ద్వారా పదువులు భర్తీ కానున్నాయి. ఈ దృష్ట్యా, 2026 ఎన్నికలలో గెలుపు లక్ష్యంగా నేతలు శ్రమించేందుకు సిద్ధమవుతున్నారు. మళ్లీ అధికారం దిశగా డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రతి పక్షాల గుప్పెట్లో ఉన్న, 2021లో తక్కువ ఓట్లతో గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల నేతలతో చైన్నెకు పిలిపించి సమీక్షిస్తూ వస్తున్నారు. ఆ దిశగా మంగళవారం ఆండిపట్టి, శ్రీవిళ్లిపుత్తూరు, చోళవందాన్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేల పనితీరు, మంత్రుల పనితీరు, స్థానికంగా ఉన్న నేతల పనితీరు, సమస్యలు గురించి ఆరా తీశారు. బలోపేతం లక్ష్యం కావాలని, అందరికి పార్టీ పదవులలో న్యాయం జరుగుతుందని, అధికారం లక్ష్యంగా శ్రమించాలని స్టాలిన్ సూచించారు.అదే సమయంలో 2026 ఎన్నికల ప్రక్రియ ముగియగానే, పార్టీ పరంగా 2027లో సంస్ధాగత సమరంకు పిలుపు నిచ్చే వ్యూహంతో స్టాలిన్ఉన్నట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. 2022లో సంస్థాగత సమరం జరగ్గా, తాజాగా ఐదేళ్ల అనంతరం 2027లో సంస్థాగత మీద దృష్టి పెట్టి, పనిచేసే వారికి పదవులు కట్టబెట్టే దిశగా వ్యూహాలకు పదును పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. 2027లో జరిగే సంస్థాగత సమరం ద్వారా పార్టీ పదవులలో కీలక మార్పులు ఉంటాయన్న చర్చ బయలు దేరింది. పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ వయోభారం, అనారోగ్య సమస్యలు తరచూ ఎదుర్కొంటుండటాన్ని పరిగణించి, ఆయన స్థానంలో డీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలను టీ ఆర్ బాలు లేదా, కేఎన్ నెహ్రూకు అప్పగించ వచ్చనే చర్చ బయలుదేరింది.