
మంత్రి సమక్షంలో చర్చలు ఫలించేనా ?
తమిళసినిమా: సమాచార, ప్రచార శాఖా మంత్రి స్వామినాథన్ సమక్షంలో జరిగిన చర్చలు ఫలిస్తాయో? లేదో వేచి చూడాల్సి ఉంది. తమిళ సినీ నిర్మాతల మండలి, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (పెప్సీ)కి మధ్య పారితోషికం విషయంలో చాలా కాలంగా వివాదం జరుగుతోంది. రెండు సంఘాల నిర్వాహకులు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఒక దశలో సమస్య తీవ్ర రూపం దాల్చింది. దీంతో పెప్సీకి యాక్టీవ్ నిర్మాతల మండలి మద్దతుగా నిలిచింది.దీంతో తమిళ సినీ నిర్మాతల మండలికి చెందిన నిర్మాతలు నిర్మించే చిత్రాలకు తమ సపోర్ట్ ఉండదని పెప్సీ ప్రకటించింది. దీంతో తమిళ సినీ నిర్మాతల మండలి కొత్తగా మరో పెప్సీ సమాఖ్యను ప్రారంభించింది. ఇలా ఒకరికొకరు తగ్గేదెలా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వివాదం ప్రభుత్వం జోక్యం చేసు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలా మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సమాచార, ప్రచార శాఖా మంత్రి స్వామినాథన్ సమక్షంలో సినీ ప్రముఖులు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళీ రామస్వామి, పెప్సీ అధ్యక్షుడు ఆర్ కే.సెల్వమణి, దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్, నిర్వాహకులు పూచీ మురుగన్, కరుణాస్, ప్రభుత్వ కార్యదర్శి రాజారామ్ తదితరులు పాల్గొని, పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరోసారి చర్చలు జరగనున్న తెలిసింది. కాగా ఇదే సమయంలో పెప్సీ అధ్యక్షుడు ఆర్ కే.సెల్వమణి, సినీ కార్మికుల సొంత గృహాల కోసం పయనూర్లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కొన్ని మార్పులు చేయాలని మంత్రి స్వామినాథన్కు వినతిపత్రం అందజేశారు. మంత్రి సమక్షంలో జరుగుతున్న ఈ చర్చలు సత్ఫలితాలు ఇస్తాయే లేదో వేచి చూడాలి.