
విద్యతోనే బంగారు భవిత
కొరుక్కుపేట: అంకితభావంతో చదివి ప్రతిభావంతంగా ఉత్తీర్ణులైన విద్యార్థులకు బంగారు భవిత సొంతమవుతుందని ఫ్రేమ్ ఫార్మా గ్రూప్ కంపెనీల మేనేజింగ్ పార్ట్నర్ బీఎల్ కుమారవేల్ అన్నారు. చైన్నె జార్జ్ టౌన్ గిడ్డంగి వీధిలోని దక్షిణ ఇండియా వైశ్య సంఘం నిర్వహణలోని వాసవి విద్యానిధి ఆధ్వర్యంలో 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. సంఘం అధ్యక్షుడు డాక్టర్ కనిగెలుపుల శంకరరావు, బీఎల్ కుమారవేల్ పాల్గొన్నారు. ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున వంద మందికి పైగా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు. అలాగే నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఇద్దరి విద్యార్థులతోపాటు ఉపకార వేతనాల కోసం రూ.లక్ష విరాళం నిచ్చిన ఉప్పు జయచంద్రన్ను సత్కరించారు. అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి నరసింహులు, కోశాధికారి పెసల రమేష్, ఉపాధ్యక్షులు ఎం ఉదయ్కుమార్, సుబ్బారావు, వాసవీ విద్యానిధి కార్యదర్శి ఎం.ప్రవీణ్కుమార్, సంయుక్త కార్యదర్శి పువ్వాడ అశోక్కుమార్ పాల్గొన్నారు.