
గుడ్ డే ఆడియో ట్రైలర్
గుడ్ డే చిత్ర ఆడియోను
ఆవిష్కరించిన రాజు మురుగన్, బాలాజీ ధోరణి ధరన్తో యూనిట్ సభ్యులు
తమిళసినిమా: న్యూ మంక్ పిక్చర్స్ పతాకంపై పృద్వీరాజ్ రామలింగం నిర్మించి హీరోగా నటించిన చిత్రం గుడ్డే. అరవింద్ దర్శకత్వం వహించారు. గోవింద్ వసంత్ సంగీతం, కార్తీక్ నేతా పాటలు అందించారు. నటి మైనా నందిని, శివ సుబ్రహ్మణ్యం, కాళీ వెంకట్, బోస్, విజయ్ మురుగన్, వెంకట్, మురుగానందం, బక్స్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గుడ్ డే చిత్రం ఈ నెల 27వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్రం ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం మధ్యాహ్నం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించారు. దర్శకుడు రాజు మురుగన్ , బాలాజీ ధరణిధరన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాజు మురుగన్ మాట్లాడుతూ ఈ చిత్రం చూడగానే కచ్చితంగా దీని గురించి మాట్లాడాలనిపించిందన్నారు. ఇది మద్యం గురించిన కథా చిత్రం మాత్రమే కాదని, అంతకు మించిన కథాంశంతో రూపొందిన చిత్రం అని పేర్కొన్నారు. మద్యం వల్ల కలిగే సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయడమే ముఖ్యం అన్నారు. అలాంటి చిత్రం ఈ గుడ్ డే అని అన్నారు. ఈ చిత్రానికి కచ్చితంగా సపోర్ట్ చేయాలన్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ విడుదల చేయనుంది. ఆ సంస్థ నిర్వాహకుడు గుహన్ మాట్లాడుతూ కొత్త వారికి సపోర్ట్ చాలా అవసరం అన్నారు. వారిని సరైన మార్గంలో తీసుకెళ్లాలన్నదే తమ భావనగా పేర్కొన్నారు. ఇది తిరుప్పూర్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని చెప్పారు. ఈ ప్రపంచం తనకు అవసరం లేదు, ఈ ప్రపంచానికి తాను అవసరం లేదు అని మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడే యువకుడి ఇతివృత్తంతో రూపొందిన చిత్రం ఇదని చెప్పారు. చిత్రాన్ని ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్లు చెప్పారు. నిర్మాణ, కథానాయకుడు పృధ్వీరాజ్ రామలింగం మాట్లాడుతూ ఇది తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించే కథా చిత్రం అని చెప్పారు. చిత్ర నిర్మాణంలో పలు సమస్యల ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చామన్నారు. వ్యాపారం కోసం చాలా ప్రదర్శనలు చేశామని, విడుదల చేయడానికి ఎవరూ ముందుకు రాలేదన్నారు. చివరికి డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేతలు గుర్తుకు వచ్చారన్నారు. ఎస్ఆర్.ప్రభు చిత్రం చూసి బాగుందని ప్రశంసించి విడుదల చేయడానికి ముందుకు వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.