
మలయాళ దర్శకుడితో సూర్య
తమిళసినిమా: సూర్య వంటి స్టార్ హీరో కెరీర్కి ప్లాప్లు అంతగా ప్రభావం చూపవు. ఆ మధ్య వచ్చిన కంగువ చిత్రంలో సూర్య నటనకు ప్రశంసలు జల్లు కురిసినా చిత్రం మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. అయితే ఆ తరువాత సూర్య కథానాయకుడిగా నటించిన రెట్రో చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. ఇక కొత్త చిత్రాల విషయానికి వస్తే బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన ఆర్జే.బాలాజీ దర్శకత్వంలో నటిస్తున్న కరుప్పు చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన 46వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభ దశలో ఉండగా మరో కొత్త చిత్రానికి కమిట్ అయినట్లు తాజా సమాచారం. సూర్య ప్రముఖ మలయాళ దర్శకుడితో కలిసి పని చేయడానికి సమ్మతించినట్లు తెలిసింది. మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన జీతు మాధవన్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రంలో సూర్య నటించనున్నారని సమాచారం. జీతు మాధవన్ ఇంతకు ముందు ఆవేశం అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా నటుడు మోహన్లాల్ హీరోగా చిత్రం చేయించాల్సి ఉన్నా, అది డ్రాప్ అయ్యిందని సమాచారం. అలాగే నటుడు సూర్య వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాల్సి ఉన్నా వాడివాసల్ చిత్రం కూడా డ్రాప్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సూర్య తన 47వ చిత్రాన్ని మలయాళ దర్శకుడు జీతా మాధవన్తో కలిసి చేయడానికి పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. ఈ విషయాన్ని దర్శకుడు జీతూ మాధవన్ ధ్రువపరిచారు. సూర్య హీరోగా నటించే చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు ఒక భేటీలో పేర్కొన్నారు. కాగా చిత్రాన్ని ఇంతకు ముందు వాడివాసల్ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేసిన కలైపులి ఎస్ ధాను నిర్మించనున్నట్లు సమాచారం.