
అబివృద్ధి పనులను వేగవంతం చేయండి
తిరువళ్లూరు: జిల్లాలోని ఎల్లాపురం యూనియన్లో జరుగుతున్న వేర్వేరు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతాప్ అధికారులను ఆదేశించారు. తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్లోని కన్నిగాపురం, ఊత్తుకోట, పాలవాక్కం, గురువాయల్, తిరుకండలంతో సహా వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కలైంజర్ పక్కాగృహాలు, అన్నా పునఃజీవనం పథకం కింద జరుగుతున్న సిమెంట్ రోడ్డు, తారురోడ్డు నిర్మాణం, అంగన్వాడీ భవన నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులను పరిశీలించి, పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఊత్తుకోటలో రూ.22 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్, చీఫ్ ఇంజినీర్ శరవణన్, ఊత్తుకోట మేజర్ పంచాయతీ కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు.