
తమిళావనికి వళ్లువర్ కోట్టం అంకితం
● ప్రారంభించిన సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె : ఎట్టకేలకు వళ్లువర్ కోట్టం మళ్లీ సుందరంగా ముస్తాబైంది. తమిళావనికి ఈ వళ్లువర్ కోట్టాన్ని అంకితం చేస్తూ సీఎం స్టాలిన్ శనివారం రాత్రి ప్రారంభించారు. ఈ పర్యాటక క్షేత్రం విద్యుత్ వెలుగులతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. చైన్నె నుంగంబాక్కంలోని వళ్లువర్కోట్టం తమిళ సంస్కృతి, సంప్రదాయాలు, పురాతనతకు అద్దం పట్టే కళాఖండాల సమూహరంతో నిండిన పర్యాటక ప్రదేశం. తమిళ కవి తిరువళ్లువర్ పేరిట ఒకప్పుడు డీఎంకే హయంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నగరం నడి బొడ్డున రూపుదిద్దుకున్న ఈ వళ్లువర్కోట్టంలోని రథం ప్రత్యేక ఆకర్షణ. డీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఈ పర్యాటక ప్రదేశంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగేది. అయితే, గత పదేళ్లు అన్నాడీఎంకే పాలనలో ఈ వళ్లువర్కోట్టం శిథిలావస్థకు చేరింది. దీంతో గత ఏడాది సీఎం స్టాలిన్ వళ్లువర్ కోట్టంపై దృష్టి పెట్టారు. రూ. 80 కోట్లతో వళ్లువర్కోట్టానికి సొబగులు దిద్దేందుకు సిద్ధం అయ్యారు. ఇక్కడి శిల్ప సంపద చెక్కు చెదరని రీతిలో మళ్లీ పునరుద్ధరించారు. తొలి అంతస్తులో 1400 మంది కూర్చునేందుకు వీలుగా పూర్తి ఏసీ సౌకర్యంతో ఆడిటోరియం తీర్చిదిద్దారు. మరో అంతస్తులో వేలాది పుస్తకాలతో గ్రంథాలయం కొలువు దీరింది. వివిధ చర్చా కార్యక్రమాలకు వేదిక బ్రహ్మాండ హంగులతో ఇక్కడ అనేక నిర్మాణాలతో రూపుదిద్దుకున్నాయి. కురల్ మణి మండపాన్ని ఆధునీకరించారు. 1300 కురల్(సూక్తులు)ను ఇక్కడి రాళ్లలో పొందు పరిచినట్టుగా పుస్తకం తరహాలో నిర్మాణాలను ఆధునీకరించారు. 1330 తిరుక్కురల్ చిత్ర లేఖనాలు చెక్కు చెదరని రీతిలో పెయింటింగ్స్తో కొత్త శోభను తీసుకొచ్చారు. వళ్లువర్ కోట్టంలో 106 అడుగుల రాతి రథం మరింత ఆకర్షణగా మారింది. ఈ పరిసరాలన్నీ విద్యుత్వెలుగులో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. ఈ వళ్లువర్ కోట్టాన్ని శనివారం రాత్రి సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తిరుక్కురల్ , తిరువళ్లువర్ గురించి ప్రసంగిస్తూ ఈ వళ్లువర్ కోట్టాన్ని తమిళావనికి అంకితం ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్తో పాటుగా పలు పథకాలను ప్రకటించిన సీఎం స్టాలిన్ను ఆ సంఘాల నేతలు ఘనంగా సత్కరించారు.