
భారతీయ తెగల అభ్యున్నతికి కృషి
సాక్షి, చైన్నె : భారతీయ తెగల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అత్యంత కృషి చేస్తుందని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం నేతృత్వంలో శని, ఆదివారాల్లో గిరిజన ప్రతిఘటన, స్థితిస్థాపకత, భవిష్యత్తు, భగవాన్ బిర్సా ముండా 150 సంవత్సరాల వేడుకలకు చర్యలు తీసుకున్నారు. గిరిజన చరిత్ర, ప్రతిఘటన ఉద్యమాలు, గుర్తింపు, భవిష్యత్తు అవకాశాల ఇతివృత్తాలతో నిమగ్నమయ్యే పండితులతో తొలిరోజు జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనరెడ్డి మాట్లాడుతూ భారతదేశ గిరిజనుల దేశీయ జ్ఞానం సైన్స్ అండ్ టెక్నాలజీతో సహా ఆధునిక జీవనశైలితో అనుసంధానం కావాలన్నారు. దేశంలోని గిరిజన వర్గాల ప్రజలు, వారసత్వం, అభ్యున్నతి, సంరక్షణ కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆయన ఈసందర్భంగా తెలిపారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో భగవాన్ బిర్సా ముండా చేసిన కృషి, వైద్యుడిగా ప్రజలకు ఆయన చేసిన సహాయం ఎనలేనిదని కొనియాడారు. గిరిజన జీవితంలోని వివిధ అంశాల్లో పరిశోధన అవసరాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్లోని మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్రాల విభాగాధిపతి ప్రొఫెసర్ రాజేష్ కుమార్, డీన్ (విద్యార్థులు) ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్. గుమ్మడి తదితరులు పాల్గొన్నారు.