
కనువిందుగా ఆరుపడై వీడులు
● గవర్నర్ రవి వ్యాఖ్య ● మురుగన్ మహానాడుకు సర్వం సిద్ధం
సాక్షి, చైన్నె: ఆరుపడై వీడులలోని సుబ్రహ్మణ్య స్వామి వారిని ఒకే చోట చూడటం కనువిందుగా, ఆనందంగా ఉందని గవర్నర్రవి వ్యాఖ్యానించారు. బీజేపీ, హిందూ సంఘాల నేతృత్వంలో మదురై వేదికగా ఆదివారం మురుగన్ భక్తుల మహానాడుకు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఆరుపడై వీడులుగా మురుగన్కు ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నీ ఒక చోట చేర్చినట్టుగా ఆరుపడై వీడుల సెట్టింగ్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సెట్టింగ్తో కొలువు దీర్చిన సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకునేందుకు జన సందోహం తరలి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శనివారం మురుగన్ మహనాడు జరిగే ప్రాంతాన్ని గవర్నర్ రవి సందర్శించారు. ఇక్కడ కొలువు దీర్చిన ఆరుపడై వీడులను సందర్శించారు. పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరుపడై వీడులన్నీ ఒక చోట చేర్చడం కనువిందుగాను, ఆనందంగాను ఉందని వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయేతర కార్యక్రమంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. కాగా, ఆదివారం జరిగే మహానాడుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కానున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. అదే సమయంలో దక్షిణభారత చలన చిత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రచారం ఊపందుకుంది. అయితే రజనీకాంత్ హాజరు కావడం లేదని ఆయన తరపున ప్రతినిధులు ఎక్స్లో పేర్కొన్నారు. ఆయన ఈ మహానాడుకు వెళ్తారన్నది అవాస్తవం అని , ఇది ప్రచారం మాత్రమేనని, రాజనీకాంత్ హాజరు కావడం లేదని స్పష్టం చేశారు.