
రీ రిలీజ్కు తడైయార తాక్క
తమిళసినిమా: ఇంతకుముందు విడుదలై ఘన విజయాన్ని సాధించిన చిత్రాలు రీ రిలీజై నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. అలా నటుడు అరుణ్విజయ్ కథానాయకుడిగా నటించిన తడైయార తాక్క రీరిలీజ్కు సిద్ధం అవుతోంది.అరుణ్ విజయ్కు జంటగా మమతా మోహన్దాస్, రకుల్ప్రీత్సింగ్ నటించిన ఇందులో వంశీకృష్ణ, అరుళ్దాస్ ,కాళీ వెంకట్ ముఖ్యపాత్రలు పోషించారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయనకు మంచి పేరును తెచ్చి పెట్టింది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించారు. ఇందులో గాయనీ ఎల్ఆర్.ఈశ్వరి పాడిన పూందమల్లిడా అనే పాట సంగీత ప్రియులను ఎంతగానో అలరించింది. కాగా 2012లో తెరపైకి వచ్చిన తడైయార తాక్క మంచి విజయాన్ని అందుకుంది. నటి రకుల్ప్రీత్సింగ్ పాపులర్ అయ్యింది ఈ చిత్రంతోనే. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అప్స్వింగ్ ఎంటర్టెయిన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈనెల 27న విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ఈ సంస్థఽ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యాక్షన్ ఎంటర్టెయిన్మెంట్ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తాజాగా ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో నవీన 4కే సౌండింగ్లో రూపొందించి డిజిటల్ ఫార్మెట్లో రీ రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్లో డెవిలన్
తమిళసినిమా: అసాధ్యాలను సుసాధ్యం చేయడం చరిత్ర. ప్రయోగాలకు ఫలితం ఉంటుంది. అలా 48 గంటల్లో చిత్ర షూటింగ్ను పూర్తిచేసి విడుదల చేయడం అనే అసాధ్యాన్ని సాధ్యం చేసిన డెవిలన్ చిత్ర యూనిట్ ఇప్పుడు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకెక్కారు. సీకర్ పిక్చర్స్ పతాకంపై పి.కమలకుమారి, ఎన్.రాజ్కుమార్ 48 గంటల్లో డెవిలన్ పేరుతో చిత్ర షూటింగ్ను పూర్తి చేసి థియేటర్లలో విడుదల చేసే ప్రయత్నం చేశారు. ఆ విధంగా ప్రకటించిన ప్రకారం 2025 మే నెల 29న 4.01 గంటలకు చిత్ర షూటింగ్ను ప్రారంభించి మే నెల 31న సాయంత్రం 3.58 గంటలకు నిర్మాణాన్ని పూర్తి చేసి విడుదల చేశారు. అలా ఈ చిత్ర దర్శకుడు బిక్కయ్ అరుణ్ 47.58 గంటలకే షూటింగ్, ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, మాస్టరింగ్, థియేటర్లలో విడుదల వంటి అంశాలను ప్రకటించిన దానికంటే 3 నిమిషాలు ముందుగానే పూర్తి చేసి ప్రపంచ నోబెల్ బుక్ రికార్డ్లోకి ఎక్కారు. ఈ రికార్డ్ను మే నెల 31వ తేదీనే వరల్డ్ నోబెల్ రిజిస్టర్లో నమోదు చేశారు. ఈ చిత్ర షూటింగ్ పక్రియను నోబెల్ రికార్డు సంస్థ నిర్వాహకురాలు హేమలత బృందం పర్యవేక్షణలో జరిగింది. చిత్ర సహ నిర్మాత ఎన్.రాజ్కుమార్ కథానాయకుడిగా నటించిన చిత్రంలో నటి కార్తీక, ఇందిర, ఫెడ్రిక్, బాలాజీ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి టీజే.బాలా చాయాగ్రహణం, కమల్జిత్సింగ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి ప్రపంచ నోబెల్ రికార్డ్ ప్రతినిధులు ధ్రుపత్రాన్ని అందించారు. ఈ చిత్రం ప్రపంచ నోబెల్ రికార్డ్ సాధించడం సంతోషంగా ఉందని దర్శకుడు బిక్కయ్ ఆరుణ్ పేర్కొన్నారు.

రీ రిలీజ్కు తడైయార తాక్క