
విద్యార్థులకు విజయ్ ప్రోత్సాహకం
● మూడు విడతలుగా టాపర్లకు సత్కారం
సాక్షి, చైన్నె: పదో తరగతి, ప్లస్–2 పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించడమే కాకుండా వారికి ప్రోత్సాహక నగదు అందజేయడానికి తమిళగ వెట్రి కళగం నేత, సినీనటుడు విజయ్ నిర్ణయించారు. కమిళగ వెట్రి కళగం పార్టీని గత ఏడాది ప్రకటించినానంతరం తొలి కార్యక్రమంగా ప్లస్టూ, పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన టాపర్లను నియోజకవర్గాల వారీగా సత్కరించేందుకు విజయ్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. విద్యార్థులకు వజ్రాలు, బంగారు ఉంగరాలు, నాణెలతో పాటూ నగదు ప్రోత్సాహకాలను విజయ్ అందజేశారు. ఈ ఏడాది పార్టీ పరంగా కార్యక్రమాలను వేగవంతం చేసిన విజయ్ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ను సిద్ధంచేసుకుంటున్నారు. పనిలో పనిగా ఈ ఏడాది ప్లస్టూ, పదో తరగతి లో ఉత్తమ మార్కులు సాధించిన వారిని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసి సత్కరించేందుకు సిద్ధమయ్యారు.
30న మహాబలిపురంలో తొలి కార్యక్రమం
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల జాబితాను తమిళగ వెట్రి కళగం వర్గాలు సిద్ధం చేసి ఉన్నాయి. ఈనెల 30వ తేదీ నుంచి మూడు విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకు సంబంఽఽధించి తొలి విడుత కార్యక్రమానికి సంబంధించిన వివరాలతో ఆయా జిల్లాల కార్యదర్శులకు అనుమతి కార్డులను మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ అందజేశారు. ఈ మేరకు 30వ తేదీన మహాబలిపురంలోని షెరటాన్ హోటల్లో కార్యక్రమం జరగనుంది. తొలి విడతగా అరియలూరు, కడలూరు, కళ్లకురిచ్చి, కన్యాకుమారి, చెంగల్పట్టు, శివగంగై, దిండుగల్, చైన్నె, తిరువళ్లురు, తేని, నాగపట్నం, పుదుకోట్టై, పెరంబలూరు, వేలూరు, జిల్లాలోని 88 అసెంబ్లీ నియోజకవర్గాలలోని టాపర్లను సత్కరించనున్నారు. నియోజకవర్గానికి ముగ్గురు టాపర్లు, వారి తల్లిదండ్రులను చైన్నెకు పిలిపించి విజయ్ చేతుల మీదుగా సత్కారం, కానుకల పంపిణీకి చర్యలు చేపట్టారు. మలి విడతగా జూన్ మొదటి వారంలో, మూడో విడతగా రెండో వారంలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, మిగిలిన విడతలలో ఒకటి మదురైలో , ఇంకొకటి సేలంలో ఉండవచ్చు అన్న సమాచారాలు వెలువడ్డాయి.