
నిధుల సేకరణకు ఆర్థిక సెక్యూరిటీలు
– గ్రేటర్ చైన్నెలో రూ.200 కోట్లు షేర్ల జారీ
సాక్షి, చైన్నె: నిధుల సేకరణలో భాగంగా గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ పరిధిలో రూ. 200 కోట్లతో పట్టణాభివృద్ధిని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో (ఎన్ఎస్ఈ) ఆర్థిక సెక్యూరిటీల జాబితా (లిస్టింగ్)లోకి చేర్చారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు తమిళనాడు ప్రభుత్వం ఆర్థిక సహాయం కోసం వివిధ వినూత్న నిధుల సేకరణ కార్యక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రయత్నంలో, మెట్రోపాలిటన్ చైన్నె మున్సిపల్ బాండ్ల ద్వారా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి నిర్ణయించారు. గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ 10 సంవత్సరాల కాలానికి, సంవత్సరానికి 7.97 శాతం చాలా తక్కువ వడ్డీ రేటుకు రూ.200 కోట్ల అర్బన్ ఫైనాన్స్ సౌకర్యం లక్ష్యంగా చర్యలు తీసుకున్నారు. 2025లో దేశంలోనే అతిపెద్ద బాండ్గా దీనిని జారీ చేశారు. దీని ఆధారంగా పెట్టుబడిదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
కుశస్థలి ప్రగతికి నిధులు..
ప్రాథమిక ఇష్యూ మొత్తం రూ. 100 కోట్లు కాగా, 421 కోట్ల విలువైన వేలం జరిగినట్టు, ఇది 4.21 రెట్లు ఎక్కువగా ప్రకటించారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎలక్ట్రానిక్ వేలం ద్వారా దీనిని పొందినట్టు, ఇది మహానగర చైన్నె కార్పొరేషన్ బలమైన ఆర్థిక నిర్వహణ, ప్రణాళిక నిర్మాణంపై పెట్టుబడిదారులలో బలమైన విశ్వాసాన్ని స్పష్టం చేస్తున్నట్టు వివరించారు. ఈ అర్బన్ ఫైనాన్స్ బాండ్ల ద్వారా సేకరించిన నిధులను కుశస్థలి నదీ పరివాహక ప్రాంతాలలో ఇంటిగ్రేటెడ్ వర్షపు నీటి పారుదల సిస్టమ్(ఐఎస్డబ్ల్యూడీ) కోసం ఉపయోగించనున్నారు. ఇది ఒక ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు అని, కుశస్థలి నదీ ప్రాంతంలో 8 పెద్ద సరస్సులు , 71 చిన్న సరస్సులు ఉన్నాయని వివరించారు. వీటినిఅ భివృద్ధి పరిచి నీటిని నిల్వ ఉంచడం ద్వారా వేసవిలో తాగునీ టి అవసరాలను తీర్చేందుకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావించింది. ఇందు కోసం నిధుల సేకరణ మీద దృష్టి పెట్టే విధంగా కలైవానర్ అరంగంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో రూ. 200 కోట్ల విలువైన అర్బన్ బాండ్లను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లిస్టింగ్లో చేర్చే కార్యక్రమం జరిగింది. బాండ్ ఇష్యూలోని అన్ని షేర్లును ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఏజెంట్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్. నెహ్రూ, పి.కె. శేఖర్ బాబు, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ మేయర్ ఆర్. ప్రియ, ఎమ్మెల్యే ఎం.కె. మోహన్, డిప్యూటీ మేయర్ ఎం. మహేష్కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, చీఫ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆర్థికవేత్త డాక్టర్ తీర్థంకర్ పట్నాయక్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఉదయచంద్రన్, నీటి సరఫరా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ కార్తికేయన్, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ కమిషనర్ జె. కుమారగురుబరన్ పాల్గొన్నారు.