
సేలంలో రైతు ఆత్మహత్య
సేలం: ఈఎంఐ ఆలస్యం కావడంతో ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు ఒత్తిడి చేసి, అసభ్యంగా మాట్లాడడం తట్టుకోలేక ఓ రైతు విషం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సేలం జిల్లా వాళప్పాడిలో కలకలం రేపింది. వివరాలు.. సేలం జిల్లా వాళప్పాడి సమీపంలోని తుక్కియంపాళయం ప్రాంతానికి చెందిన రైతు వడివేల్(55) నాలుగు సంవత్సరాల క్రితం తన వ్యవసాయ భూమిని తాకట్టుగా ఉపయోగించి వాళప్పాడిలోని ఒక ప్రైవేట్ బ్యాంకు నుండి రూ.5 లక్షలు అప్పు తీసుకున్నాడు. అతను వాయిదాలు సరిగ్గా చెల్లిస్తున్నాడు. ఈ పరిస్థితిలో ఏప్రిల్ 10వ తేదీకి చెల్లించాల్సిన వాయిదాలో రూ.12,300 మాత్రమే ఇంకా చెల్లించలేదని తెలుస్తోంది. గత రెండు రోజులుగా రైతు డబ్బు చెల్లించాలని బ్యాంకు సిబ్బంది ఆయన్ను తీవ్రంగా ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం రైతు వడివేల్ ఇంటికి వెళ్లిన బ్యాంకు సిబ్బంది ఈఎంఐ డబ్బులు ఇస్తేనే ఇంటి నుంచి వెళతామని పట్టుబడ్డి, ఆయన్ను అవమానించే విధంగా దుర్భాషలాడినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వడివేల్ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వడివేల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో బాధిత ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులపై చర్యలు తీసుకునే వరకు రైతు వడివేలు మృతదేహాన్ని తీసుకోబోమని ఆయన బంధువులు ఆందోళన చేపట్టారు. వాళప్పాడి పోలీసులు కేసు నమోదు చేసి, ఈ దారుణానికి పాల్పడిన ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులను విచారిస్తున్నారు.
బ్యాంకుపై చర్యలు చేపట్టాలి
●అన్బుమణి రాందాస్ డిమాండ్
కాగా ఈ విషయంపై పీఎంకే నేత అన్బుమణి రాందాస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశాడు. అందులో.. రైతు ఆత్మహత్యకు బ్యాంకు సిబ్బందే కారణమని, వారిపై తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం, తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో రుణగ్రహీతలపై ఒత్తిడి తెచ్చే ఎవరికై నా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుందని ప్రకటించిందన్నారు. అయితే ఇప్పుడు ఈఎంఐ ఆలస్యం అయ్యిందని ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు తనపై చెడుగా మాట్లాడి రైతును ఆత్మహత్యకు పురికొల్పారని ఆరోపించారు. సదరు బ్యాంకుపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈఎంఐ కట్టలేదని
బ్యాంకు ఉద్యోగుల ఒత్తిడి