విద్యార్థుల బడిబాట | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల బడిబాట

Jun 3 2025 2:16 PM | Updated on Jun 3 2025 2:16 PM

విద్య

విద్యార్థుల బడిబాట

● ముగిసిన వేసవి సెలవులు ● తెరుచుకున్న పాఠశాలలు ● పలు చోట్ల ఘన స్వాగతం ● పుస్తకాలు, యూనిఫాం పంపిణీకి శ్రీకారం ● చైన్నెలో ప్రారంభించిన సీఎం స్టాలిన్‌

సాక్షి, చైన్నె గతంతో పోల్చితే ఈ సారి వేసవి సెలవులు తక్కువే. ముందుగా నిర్ణయించిన మేరకు సెలవులు, ఆ తర్వాత పునఃప్రారంభం జరిగింది. నిర్ణయించిన సమయం కన్నా ముందుగానే పది, ప్లస్‌ ఒన్‌, ప్లస్‌టూ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు సైతం ఈసారి ముగించారు. ప్లస్‌టూ ముగిసిన విద్యార్థులు ఉన్నత చదవులపై దృష్టి పెడుతూ, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో వివిధ కోర్సుల ఎంపిక నిమిత్తం దరఖాస్తులు చేసుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో మే నెలలో పూర్తిగా వేసవి సెలవులతో గడిపిన ఇతర తరగతుల విద్యార్థులు గతంలోలా సెలవులు పొడిగిస్తారని ఎదురు చూశారు. అయితే ఈ సారి భానుడి ప్రభావం తగ్గడం, ముందుగానే నైరుతీ రుతు పవనాల ప్రవేశంతో నిర్ణయించిన మేరకు జూన్‌ 2వ తేదీ సోమవారం బడులు ప్రారంభం అయ్యాయి. సెలవులు ముగియడంతో స్వస్థలాలకు, విహార యాత్రలకు వెళ్లిన వారంతా చైన్నె వైపు రాత్రికి రాత్రే ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలలో ఒక రోజు ముందుగానే వచ్చేశారు.

పుస్తకాల పంపిణీకి శ్రీకారం

2025–26 విద్యా సంవత్సరానికి కొత్త పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, నోట్స్‌, ఇతర సామగ్రిని విద్యార్థులకు పంపిణీ ప్రక్రియ మీద విద్యా శాఖ దృష్టి పెట్టింది. సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని స్థానికంగా సీఎం స్టాలిన్‌ ప్రారంభించారు. ఉదయం ట్రిప్లికేన్‌లోని లేడీ వెల్లింగ్టన్‌ బాలిక పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి సీఎం స్టాలిన్‌ హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రయోజనం కోసం అమలు చేస్తున్న అల్పాహార పథకం, అభ్యాస సామర్థ్యం, విద్య పరంగా కార్యక్రమాలు, విద్యార్థులకు కల్పించిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు యూనిఫాం, నోట్‌బుక్‌లు, స్కూల్‌ బ్యాగులు, పాదరక్షలు, బూట్లు, సాక్స్‌, రెయిన్‌ కోట్లు, ఉన్ని చొక్కాలు, రంగుల పెన్సిళ్లు, క్రేయాన్స్‌, గణిత కిట్లు, బూట్లు, భౌగోళిక పటాలు తదితర విద్యా సామగ్రిని అందజేశారు. 2025–26 సంవత్సరానికి బడులలోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ కోసం రూ.311 కోట్లు, రూ.457 కోట్లతో 1.3 కోట్ల యూనిఫాం కొనుగోలు, రూ.162 కోట్లతో 9.6 కోట్ల నోట్‌ పుస్తకాలు, రూ.211 కోట్లతో ఇతర విద్యా పరికరాలను కొనుగోలు చేసినట్టు ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులకు పుస్తకాలను అందజేసిన సీఎం స్టాలిన్‌ తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. తాను సైతం ఓ విద్యార్థి అన్నట్టుగా వారితో కూర్చుని స్మార్ట్‌ సౌకర్యాలతో ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను విన్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ ప్రక్రియ మొదలైంది. ఈ కార్యక్రమంలో మంత్రి అన్బిల్‌ మహేశ్‌, పీకే శేఖరన్‌బాబు, మేయర్‌ ప్రియ, ఎంపీ దయానిధి మారన్‌, ఎమ్మెల్యేలు వేలు, పరంధామన్‌, డిప్యూటీ మేయర్‌ ఎం.మహేశ్‌కుమార్‌, తమిళనాడు పాఠ్య పుస్తకాల విభాగం అధ్యక్షుడు దిండిగల్‌ ఐ.లియోని, గ్రేటర్‌ చైన్నె కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ చిట్టరసు, పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పి.చంద్రమోహన్‌, తమిళనాడు విద్యా సేవల కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.శంకర్‌, చైన్నె జిల్లా కలెక్టర్‌ రష్మి సిద్ధార్థ్‌ జగడే, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కన్నప్పన్‌, ప్రాథమిక విద్య డైరెక్టర్‌ డాక్టర్‌ పి.ఓ.నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల బడిబాట 1
1/3

విద్యార్థుల బడిబాట

విద్యార్థుల బడిబాట 2
2/3

విద్యార్థుల బడిబాట

విద్యార్థుల బడిబాట 3
3/3

విద్యార్థుల బడిబాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement