
క్లుప్తంగా
17 ఎలక్ట్రిక్ రైళ్ల రద్దు
కొరుక్కుపేట: గుమ్మిడిపూండి–కవరపైట్టె మధ్య రైల్వే నిర్వహణ పనులు జరుగుతున్న నేపథ్యంలో గురువారం ఉదయం 9.40 నుంచి ఈనెల 7వ తేదీ వరకు చైన్నె మార్గంలో మొత్తం 17 సబర్బన్ ఎలక్ట్రిక్ రైళ్లను రద్దు చేశారు. అదనంగా, చెంగల్పట్టు–గుమ్మిడిపూండి, గుమ్మిడిపూండి – తాంబరం ఎలక్ట్రిక్ రైళ్లను కూడా పాక్షికంగా రద్దు చేశారు. అలాగే సెంట్రల్ నుంచి పొన్నేరికి ఉదయం 10.30 గంటలకు, సెంట్రల్ నుంచి మీంజూర్కు ఉదయం 11.35 గంటలకు, చైన్నె బీచ్ నుంచి పొన్నేరికి మధ్యాహ్నం 12.40 గంటలకు, పొన్నేరి నుంచి సెంట్రల్కు మధ్యాహ్నం 1.18, మధ్యాహ్నం 3.33 గంటలకు, మీంజూర్ నుంచి సెంట్రల్కు మధ్యాహ్నం 2.59 గంటలకు ప్రత్యేక రైళ్లను నడిపారు. వారం రోజులు ఎలక్ట్రిక్ రైళ్లను రద్దు చేయడంతో, గుమ్మిడిపూండి, మీంజూర్, పొన్నేరి సహా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వారు బస్సు సర్వీసుపై ఆధారపడాల్సి వచ్చింది. దీని కారణంగా బస్సులు రద్దీగా ఉన్నాయి.
రౌడీ దారుణ హత్య
అన్నానగర్: చైన్నెలో ఓ రౌడీ దారుణ హత్యకు గురయ్యాడు. చైన్నెలోని తిరువొత్తియూర్ నార్త్ రైల్వేరోడ్కు చెందిన జయ కుమారుడు ఆకాష్కుమార్ (22). రౌడీ అయిన ఇతనిపై పలు కేసులు ఉన్నాయి. బుధవారం రాత్రి జయ ఇంటికి తాళం వేసి దుకాణానికి వెళ్లింది. ఆ సమయంలో, అక్కడ ఉన్న గుర్తుతెలియని ముగ్గురు జయ ఇంటికి వెళ్లి, అక్కడే తాళం తీసుకొని, తలుపు తెరిచి లోపలకి వెళ్లారు. నిద్రిస్తున్న ఆకాష్కుమార్ను కత్తులతో నరికారు. ఆకాష్కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. దుకాణం నుంచి తిరిగి వచ్చిన తల్లి, తన కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండడం చూసి కేకలు వేసింది. ఆమె కేకలు విని ఇరుగుపొరుగు గుమిగూడారు. సమాచారం అందుకున్న తిరువొత్తియూర్ సీఐ రజనీష్ నేతృత్వంలోని పోలీసులు అక్కడికి వెళ్లి స్థలానికి వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష కోసం చైన్నెలోని ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాలను పరిశీలించి, అదే ప్రాంతం నుంచి ఐదుగురిని విచారణ కోసం పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.
నగలు, నగదు అపహరణ కేసులో ముగ్గురి అరెస్టు
తిరువొత్తియూరు: అవినాసి సమీపం పెరుమానల్లూరులో యువతి, యువకుడితో ఉల్లాసంగా ఉంటున్నట్లు నటించారు. దీనిని వీడియో తీసి యువకుడిని బెదిరించి నగదు, నగలు అపహరించారు. ఈ కేసులో మహిళతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపూర్ జిల్లా అవినాసి సమీపం పెరుమానల్లూరుకు చెందిన కృతిక (19) ఈరోడ్ జిల్లా అరచలూరు కుమరపాలయానికి చెందిన జగదీష్ (27), ఇతను బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో కృత్తిక అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అతన్ని ఉల్లాసానికి రమ్మని కృత్తిక జగదీష్ను పిలిచింది. దీంతో జగదీష్ పెరుమానల్లూరు వద్ద ఉన్న తట్టాంకోట ప్రాంతంలోకి వచ్చారు. అక్కడ ఒక ఇంట్లో ఇద్దరు ఉల్లాసంగా ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన మరో ఇద్దరు యువకులు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని జగదీష్ను బెదిరించారు. అతడి వద్ద 2 సవర్లు నగలు, నగదు అపహరించారు. జగదీష్ ఈవిషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. ఇందులో ధర్మపురి నగరానికి చెందిన అరుణ్ (33), ఈరోడ్కు చెందిన పళనిస్వామి (51) అనే ఇద్దరు కృతికను జగదీష్తో నటించమని చెప్పి, నగదు అపహరించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అరుణ్, పళనిస్వామి, కృతికను బుధవారం రాత్రి అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరు పరిచి జైలులో పెట్టారు.
వైభవంగా కుంభాభిషేకం
కొరుక్కుపేట: తిరువేర్కాడులోని ఆది కరుమారియమ్మన్ ఆలయ కుంభాభిషేకం గురువారం వైభవంగా నిర్వహించారు. ఉదయం కరుమారియమ్మన్కు ప్రత్యేక పూజలు, ప్రత్యేక హోమం, దీపారాధన చేశారు. అనంతరం ఉదయం 10 గంటలకు వేదశివాగమ విద్యాభూషణం స్థానికర్ చంద్రశేఖర శివం ఆధ్వర్యంలో శివాచార్యులు గోపుర కలశంపై పవిత్ర జలం పోసి కుంభాభిషేకం జరిపారు. ఆ సమయంలో భక్తులపై పవిత్ర జలాన్ని చల్లారు. భక్తులకు ఆదికరుమారియమ్మన్ను దర్శనం చేసుకున్నారు. భక్తులకు అన్నదానం చేశారు. కాంగ్రెస్ జిల్లా కమిటీ మాజీ అధ్యక్షుడు లయన్ రమేష్, తిరువేర్కాడు నగర్ మండ్రం ఉపాధ్యక్షుడు ఆనంది రమేష్, డి.జయకుమార్ పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తల కమిటీ చైర్మన్ శాండీ పి.సెల్వరాజ్, ఎ.కుందబిసురుమయ్యనన్, పి.గోవిందస్వామి, కె.చందూరు, ఎ.ఆర్. బాలసుబ్రమణ్యం, డి. బాబుశేఖర్ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
లారీ ఢీకొని కృష్ణజింక మృతి
తిరుత్తణి: లారీ ఢీకొని కృష్ణజింక మృతిచెందిన ఘటన తిరువలంగాడు ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. బుధవారం తిరువళ్లూరు–అరక్కోణం హైరోడ్డుకు సమీపంలోని వ్యాసపురం వద్ద నీటికోసం వచ్చింది. ఈసమయంలో కృష్ణజింకను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందింది. వాహనదారులు ఇచ్చిన సమాచారం మేరకు తిరువలంగాడు పోలీసులు తిరుత్తణి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తిరుత్తణి రేంజర్ విజయసారధి జింక కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం పశుసంర్థక వైద్య కేంద్రానికి తరలించి విచారణ చేస్తున్నారు.