
పునర్విభజనను వ్యతిరేకిస్తాం
సాక్షి,చైన్నె: రాష్ట్రంలోని నియోజకవర్గాల సంఖ్య మీద ప్రభావం పడే విధంగా ఉంటే లోక్సభ పునర్విభజన ప్రక్రియను వ్యతిరేకించేందుకు సిద్ధమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి అన్నారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం కుట్రలు చేస్తున్నట్టు, ఈ కారణంగా రాష్ట్రంలో అనేక స్థానాలు కోల్పోయే ప్రమాదం ఉందని డీఎంకే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బీజేపీతో జతకట్టిన అన్నాడీఎంకే ఈ వ్యవహారంలో మౌనం వహిస్తుండడాన్ని సీఎం స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంటే మౌన మేళ అంటూ ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ఇచ్చే విధంగా శుక్రవారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి స్పందించారు. నియోజకవర్గ పునర్విభజనలో తమిళనాడు హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాలని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్షా దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఒక వేళ తమిళనాడుకు ఏదేని తీవ్ర అన్యాయం జరుగుతున్నట్టు వెలుగులోకి వస్తే, వ్యతిరేకించే వారిలో తొలివ్యక్తిగా తాను ఉంటానని స్పష్టం చేశారు. తమకు కూటమితో సంబంధం లేదని, తమిళనాడు ప్రయోజనాలు ముఖ్యమని పేర్కొంటూ, స్టాలిన్ పేర్కొంటున్నట్టుగా ఇక్కడ ఎలాంటి ప్రక్రియ ఇంతవరకు మొదలు కాక పోవడం ఆలోచించ తగ్గ విషయంగా పేర్కొన్నారు. అదిగో పులి..ఇదిగో పులి అని స్టాలిన్ రాజకీయ స్వలాభం కోసం పునర్విభజనను ప్రస్తుతం చేతిలోకి తీసుకున్నారని, తమిళనాడులో లోక్సభ నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ, హిందీ వ్యవహారంలో తాము స్పష్టమైన అభిప్రాయంతోనే ఉన్నామని అన్నారు.