
ఇల్లు కూల్చేస్తారని వ్యక్తి ఆత్మహత్య
● బంధువుల రాస్తారోకో
వేలూరు: ఇల్లు కూల్చేస్తారని ఓ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేలూరు సమీపంలోని కొనవట్టంలోని దేవినగర్లో వందకు పైగా కుటుంబాలు నివశిస్తున్నాయి. ప్రస్తుతం సదుప్పేరి చెరువును పర్యాటక స్థలంగా మార్చేందుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో చెరువు కట్ట కింద ఉన్న ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించుకుని ఉన్న వారిని ఖాళీ చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ఆ ప్రాంత ప్రజలు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వినతిలో తాము మూడు తరాలుగా ఈ ప్రాంతంలో నివశిస్తున్నామని తమ ఇళ్లను కూల్చొద్దని తెలిపారు. ఈ నేపథ్యంలో దేవినగర్ ప్రాంతానికి వచ్చిన విద్యుత్ శాఖ అధికారులు ఈనెల 19వ తేదీ నుంచి ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తామని చెప్పి వెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మణి(72)గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటిని ఖాళీ చేయించాలని చెప్పడంతోనే మణి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ బందువులు, ఆ ప్రాంత వాసులు మణి మృతదేహాన్ని తీసుకోకుండా రాస్తారోకో చేశారు. విషయం తెలిసి సబ్ కలెక్టర్ సెంథిల్కుమార్, తహసీల్దార్ వడివేల్, టౌన్ డీఎస్పీ పృథ్వీరాజ్, సీఐ శ్రీనివాసన్ సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులతో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింపజేశారు.