
భక్తి శ్రద్ధలతో బక్రీద్
వేలూరు: ముస్లింలకు ముఖ్య పండుగైన బక్రీద్ పండుగను ముస్లింలు శనివారం ఉదయం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్బంగా వేలూరు ఈద్గా మైదానానికి ముస్లింలు ర్యాలీగా చేరుకుని, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే విషారం, తిరుపత్తూరు, వాణియంబాడి, గుడియాత్తం, వాలాజ, ఆంబూరు, జోలార్పేటలోనే కాకుండా జిల్లాలో మొత్తం 150 ప్రాంతాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తిరువణ్ణామలై జిల్లాలో కూడా మసీదుల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బక్రీద్ త్యాగానికి ప్రతీక అయినందున ముస్లింలు పేదలకు పశువులు, మేకలు, వస్తువులు దానం చేశారు. వేలూరు కోట మైదానంలో పలు సంవత్సర కాలంగా మూసి వేసిన మసీదును తెరవాలని ముస్లింలు పోరాటాలు చేస్తారనే ఉద్దేశంతో ముందుస్తుగా కోట ముందు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఘనంగా బక్రీద్ వేడుకలు
తిరువళ్లూరు: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ముస్లింలు శనివారం ఉదయం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారం బక్రీద్ పండుగ కావడంతో తిరువళ్లూరులోని బడా మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రధాన ఖాజీ బక్రీద్ వేడుకల ప్రత్యేకత వివరిస్తూ ప్రసంగించారు. కాగా ప్రాఽర్థనల అనంతరం తిరువళ్లూరులో ముస్లీం మత పెద్దల ఆధ్వర్యంలో నిరుపేదలకు మాంసం, దుస్తులు, బియ్యం తదితర వాటిని దానంగా అందజేశారు. అలాగే పేరంబాక్కం, పూందమల్లి, తామరపాక్కం, ఊత్తుకోట, రెడ్హిల్స్, మీంజూరు, పొన్నేరి, గుమ్మిడిపూండి, ఆవడితో పాటు పలు ప్రాంతాల్లోని మసీదులు, దర్గాలలోనూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

భక్తి శ్రద్ధలతో బక్రీద్