
చిత్తూరోళ్లు బస్సు ఎక్కొద్దు..
చిత్తూరు రూరల్(కాణిపాకం): తమిళనాడులోని వేలూరు బస్టాండ్లో శుక్రవారం అర్ధరాత్రి చిత్తూరు ప్రయాణికులకు అవమానం చోటు చేసుకుంటోంది. రాత్రి పూట తిరుపతి–వేలూరు బస్సుల్లో చిత్తూరు ప్రయాణికులను వేలూరు బస్టాండులో ఎక్కించలేదు. చాలామంది చైన్నె, బెంగళూరు నుంచి వేలూరు మీదుగా చిత్తూరుకు వస్తుంటారు. ఈ క్రమంలో చిత్తూరుకు వచ్చే ప్రయాణికులను ఆర్టీసీ బస్సు కండక్టర్లు, డ్రైవర్లు అక్కడ ఛీకొడుతున్నారు. వాళ్లను బస్సు ఎక్కనివ్వడం లేదు. బస్సు దిగేయండంటూ వారిని నిర్దాక్షిణ్యంగా దింపేస్తున్నారు. దీంతో ప్రయాణికులు, ఆర్టీసీ కార్మికుల మధ్య గొడవ చోటు చేసుకుంటోంది. ఇదే మాదిరిగా తిరుపతి ప్రయాణికులను కూడా ఎక్కనివ్వకుండా ఓ బస్సు కండక్టర్ ఇబ్బందులకు గురిచేశాడు. తిరుమలకు వెళ్లే బస్సులో మాత్రమే ఎక్కనిచ్చి.. మిగిలిన వాళ్లను ఎక్కించుకోలేదు. దీంతో గంటల తరబడి బస్టాండులో నిరీక్షించాల్సి వచ్చింది. ఈ ఏడాది కాలంలో వేలూరు బస్టాండులో చిత్తూరు వాళ్లను ఎక్కించడం లేదని పలుమార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోవడం లేదని చిత్తూరు వాసులు మండిపడుతున్నారు. ఆదాయం పేరుతో కొందరు ఆర్టీసీ ఉద్యోగులు ఇలా అత్యుత్సాహం చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలానే కొనసాగితే చిత్తూరు మీదుగా వేలూరుకు ఆర్టీసీ బస్సులను తిరగనివ్వమని స్పష్టం చేస్తున్నారు.
తమిళనాడు వేలూరు బస్టాండ్లో చిత్తూరు ప్రయాణికులకు అవమానం
ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి, చిత్తూరు ప్రయాణికులను ఎక్కించుకోని వైనం
ఎవడికి చెబుతారో చెప్పుకోడంటూ ప్రయాణికులపై కండక్టర్ చిందులు
శాఖ అధికారులకు ఫిర్యాదు

చిత్తూరోళ్లు బస్సు ఎక్కొద్దు..