
త్వరలో అన్నీ సర్దుకుంటాయి!
సాక్షి, చైన్నె: పీఎంకేలో నెలకొన్న పరిణామాలన్నీ త్వరలో సర్దుకుంటాయని ఆపార్టీ గౌరవాధ్యక్షుడు జీకే మణి అన్నారు. రాందాసును అన్బుమణి కలవడం శుభ పరిణామం అని వ్యాఖ్యానించారు. పీఎంకేలో నెలకొన్న అధికార సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గురువారం తైలాపురం గెస్ట్హౌస్లో పార్టీ వ్యవస్థాపకుడు, తండ్రి రాందాసును అన్బుమణి రాందాసు కలిసి వెళ్లారు. అయితే, అధ్యక్ష పదవిని వదలుకునే పరిస్థితుల్లో అన్బుమణి లేదన్నట్టు తెలిసింది. ఈవిషయంలోనే పార్టీలో వివాదం జరుగుతోంది. అదే సమయంలో రాందాసు సైతం మెట్టు దిగకపోవడంతో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని కేడర్ ఎదురుచూస్తోంది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం పార్టీ ముఖ్యనేత, కేంద్ర మాజీ మంత్రి ఏవీ వేలుతో పాటు పలువురు నేతలు రాందాసుతో భేటీ అయ్యారు. సీనియర్లు అందరూ రాందాసును కలిసి వెళ్తుండడంతో త్వరలో కీలక ప్రకటన వెలువడవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో శుక్రవారం రాందాసును కలిసేందుకు వచ్చిన జీకే మణి మీడియాతో మాట్లాడుతూ త్వరలో అన్నీ సర్దుకుంటాయని స్పష్టం చేశారు. రాందాసును అన్బుమణి కలవడం శుభపరిణామమని త్వరలో మంచి నిర్ణయం వెలువడుతుందని వ్యాఖ్యానించారు. అదేసమయంలో ఈనెల 8న మదురైకు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్షాను రాందాసు, అన్బుమణి కలుస్తారా అనే చర్చ పీఎంకేలో ఊపందుకుంది.