
● ఒకరు దుర్మరణం ● మరో ముగ్గురికి తీవ్రగాయాలు
లారీని ఢీకొన్న కారు
సేలం: లారీని కారు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ధర్మపురి జిల్లాలో చోటుచేసుకుంది. మలయాళ నటుడు చింతమ్ సాఖో (41) తన కుటుంబంతో కలిసి కేరళలోని కొచ్చిన్ నుంచి శుక్రవారం బెంగళూరుకు కారులో తండ్రి సిబిసాచో (70), తల్లి మరియం కార్లోస (60), సోదరుడు జోకో సాచో (36)తో కలిసి బయలుదేరారు. కేరళలోని త్రిసూర్కు చెందిన అనిస్ (42) కారు నడుపుతున్నాడు. ధర్మపురి జిల్లాలోని పాలకోడ్ సమీపంలోని పరియూర్ జాతీయ రహదారి సమీపంలో వెళుతుండగా కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో సిబిసాచో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ తప్ప మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సిబిసాచో మృతదేహాన్ని శవపరీక్ష కోసం ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.