
ముస్తాబు
బక్రీద్
● నేడు పండుగ ● మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు ● ముస్లీంలకు నేతల శుభాకాంక్షలు
నేడు బక్రీద్
నేతల శుభాకాంక్షలు
దిండుగల్ మసీదు
మదురై మసీదు
సాక్షి, చైన్నె: త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను శనివారం జరుపుకునేందుకు రాష్ట్రంలోని ముస్లింలు సిద్ధమయ్యారు. ప్రత్యేక ప్రార్థనలకు మసీదులు, ఈద్గా మైదానాలు సిద్ధమయ్యాయి. బక్రీద్ పురస్కరించుకుని ముస్లింలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి శుభాకాంక్షలు తెలిపారు. భక్తిభావం మిన్నంటే పండుగ ‘రంజాన్’ అనంతరం ముస్లింలు జరుపుకునే మరో పండుగ బక్రీద్. ఈ పండుగను ఈదుల్ జుహా, ఈదుజ్జుహా అని కూడా పిలుస్తారు. దైవ ప్రవక్తల్లో ఒకరైన హజ్రత్ ఇబ్రాహీం త్యాగాన్ని స్మరిస్తూ ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు. ఈ మాసంలోనే ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తారు. బక్రీద్ పర్వదినాన మక్కాలో నమాజు చేయడానికి అత్యధికులు ఇష్టపడతారు. ఈ ప్రార్థన కోసం ఇప్పటి నుంచే రాష్ట్రం నుంచి హజ్ కమిటీ ద్వారా పలు బృందాలు చైన్నె నుంచి హజ్ యాత్రకు వెళ్లాయి. బక్రీద్ పర్వదినాన ప్రార్థనే కాదు, ఖుర్బానీ ఇవ్వడం అత్యంత ముఖ్య ఘట్టం. ఖుర్బానీ ఇచ్చిన గొర్రె మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి కుటుంబీకులు, బంధుమిత్రులు, పేదలకు పంచి పెట్టనున్నారు.
బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని ముస్లింలకు రాజకీయ పక్షాల నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలుపుతూ, త్యాగాన్ని చాటే విధంగా బక్రీద్ను జరుపుకునే ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇస్లాం మతంలో రెండు ప్రధాన పండుగల్లో బక్రీద్ కూడా ఒకటి అని గుర్తుచేస్తూ, ముస్లింలకు ద్రావిడ మోడల్ ప్రభుత్వ సహకారం, సేవలు, పథకాలను గుర్తుచేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, మాజీ సీఎం పన్నీరుసెల్వం, తమిళగ వెట్రి కళగంనేత విజయ్, డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్, పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి రాందాసు, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, మనిద నేయ మక్కల్ కట్చి నేత జవహరుల్లా, టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు.
శనివారం బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు అత్యధికంగా నివసించే ప్రదేశాల్లో శుక్రవారం నుంచే సందడి వాతావరణం నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం జరిగే జుమా నమాజు అనంతరం బక్రీద్ పండుగ ఏర్పాట్లపై ముస్లింలు దృష్టిపెట్టారు. కొత్త బట్టల కొనుగోళ్లను ఇప్పటికే పూర్తిచేశారు. ఖుర్బానీకి గొర్రెల్ని సిద్ధం చేశారు. పండుగ రోజున ప్రత్యేక ప్రార్థనల కోసం టోపీలు, అత్తరు, బిర్యానీ, తీపి పదార్థాల తయారీకి ఉపయోగించే వస్తువుల కొనుగోళ్ల నిమిత్తం షాపింగ్ సెంటర్లకు తరలివచ్చారు. అలాగే, బక్రీద్ ప్రార్థనలకు రాష్ట్రంలోని మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఉదయం ఏడున్నర గంటలు, ఎనిమిది గంటలకు, మరికొన్ని చోట్ల ఎనిమిదిన్నర, తొమ్మిది గంటలకు ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు జరిగాయి. ఖుర్బాని నిమిత్తం గొర్రెలు, మేకల వ్యాపారం ఈసారి కూడా కోట్లలో జరిగింది. ఒక్కో మేక, గొర్రె ధర రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు పలికింది. తమ స్థోమతకు తగ్గట్టుగా మేకలు, గొర్రెలను కొనుగోలు చేసిన వారు కొందరు అయితే, మరి కొందరు కలిసికట్టుగా తలా కొంత మొత్తాన్ని చెల్లించుకుని ఉమ్మడి ఖుర్బానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
న్యూస్రీల్

ముస్తాబు

ముస్తాబు

ముస్తాబు

ముస్తాబు