
పుస్తకాల పఠనంపై ఆసక్తి పెరగాలి
సాక్షి, చైన్నె: పుస్తకాలు చదవడంపై ప్రతిఒక్కరిలోనూ ఆసక్తి పెరగాలని వక్తలు వ్యాఖ్యానించారు. రచయిత, నిర్మాత, దర్శకుడు, చిత్ర కారుడు లెస్లీ కార్వాల్హో రాసిన ‘స్మోక్ ఆన్ ది బ్యాక్ వాటర్స్’ నవల విడుదల, విశ్లేషణ కార్యక్రమం స్థానికంగా గురువారం జరిగింది. ప్రముఖ ప్రసార జర్నలిస్ట్ జెన్నిఫర్ అరుల్తో సంభాషణలో పుస్తకం నుంచి కొన్ని భాగాలను ఆంగ్ల సాహిత్యంలో పండితురాలు బ్రిటినీ కేథరిన్ బారెన్ చదవి వినిపించారు. మద్రాస్ బుక్ క్లబ్ సహకారంతో జరిగిన ఈ పుస్తక విశ్లేషణలో రచయిత లెస్లీ కార్వాల్హో బెంగళూరులో పుట్టి పెరిగి కళాశాల జీవితాన్ని ముగించినట్టు తెలిపారు. జర్మనీలో ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడమేకాకుండా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ అభ్యసించారు. విద్యార్ధి దశలో చెరిష్– ఐ అనేక అవార్డును గెలుచుకున్నారు. తొలి ఫీచర్ సినిమాగా ‘ది ఔట్హౌస్’ను రచించి, నిర్మించి, దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఉత్తమ నూతన దర్శకుడిగా ‘అరవిందన్ పురస్కారం’, ‘ది గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు’ను గెలుచుకున్నట్టు వివరించారు. ‘ఎ ఉమెన్ టూ మెనీ’ అనే లఘు చిత్రానికి రచయితగా నిర్మాతగా, దర్శకుడిగా కూడా వ్యవహరించిన రచయిత పలు పుస్తకాలను రూపొందించి ప్రస్తుతం ‘స్మోక్ ఆన్ ది బ్యాక్ వాటర్స్’ ఆయన తొలి నవలను తీర్చిదిద్దారని వివరించారు. పుస్తకాల రచనలపై ఆసక్తి ప్రతిఒక్కరిలోనూ పెరగాలని, అదే విధంగా వివిధ పుస్తకాలను చదవి అందులోని భావాలను సంగ్రహించే విధంగా పఠనాశక్తి ప్రతిఒక్కరిలోనూ పెరగాలని ఈసందర్భంగా వక్తలు వ్యాఖ్యానించారు.