
నేడు సెమ్మొళి దినోత్సవం
● కరుణ జయంతికి ఏర్పాట్లు ● కలైంజ్ఞర్ అవార్డులకు ముగ్గురి ఎంపిక
సాక్షి, చైన్నె: డీఎంకే దివంగత నేత ఎం.కరుణానిధి జయంతిని సెమ్మొళి దినోత్సవంగా మంగళవారం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాడవాడల్లో కార్యక్రమాలకు డీఎంకే వర్గాలు ఏర్పాట్లు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ముగ్గురికి కలైంజ్ఞర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
పెరియార్, అన్నా మార్గంలో తమిళనాడు కోసం తన జీవితాన్ని అంకితం చేసుకున్న నేత కరుణానిధి. తిరుక్కువలై గ్రామంలో జన్మించిన కరుణానిధి చైన్నె మెరీనా తీరంలో శాశ్వత నిద్రలో ఉన్నారు. 1957 నుంచి 2016 వరకు 13 సార్లు ఎమ్మెల్యేగా ఓటమి ఎరుగని నేతగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1969, 1971, 1989, 1996, 2006లో తమిళనాడు ముఖ్యమంత్రిగా వ్యవహరించడమే కాదు, జాతీయ రాజకీయాలలోనూ చక్రం తిప్పారు. నాటకం, సాహిత్యం, సినీ, రాజకీయం అంటూ ఏ రంగంలోనైనా సరే తనకు తానే సాటి అన్నట్టుగా ముందుకు సాగారు. ఆధునిక తమిళనాడు శిల్పిగా విశిష్ట పథకాలతో తమిళ హృదయాలలో అజరామరంగా ఉన్న ముత్తువేల్ కరుణానిధికి మంగళవారం 102వ జయంతి.
వేడుకలకు ఏర్పాట్లు
డీఎంకే అధికారంలోకి వచ్చినానంతరం గత నాలుగు సంవత్సరాలుగా కరుణానిధి జయంతిని అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నారు. ఏడాది పొడవున శత జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రస్తుతం 102వ జయంతిని సెమ్మొళి దినోత్సవంగా ఈ ఏడాది మరింత వేడుకగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. చైన్నెలోని కలైవానర్ అరంగంలో సీఎం స్టాలిన్ నేతృత్వంలో బ్రహ్మాండ కార్యక్రమం జరగనున్నది. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ రీసెర్చ్ నేతృత్వంలో రూపొందించిన పుస్తకాల ఆవిష్కరణ, పరిశోధనా స్కాలర్లకు అర్హత సర్టిఫికెట్లు జారీ, తమిళ పండితులకు సత్కారాలు, కలైంజ్ఞర్ అవార్డులు, వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం బహుమతుల ప్రదానం, నాలుగు సంవత్సరాల ప్రభుత్వ విజయాలతో సావనీర్ ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు ఈ వేడుకలో భాగం కానున్నాయి. అలాగే డీఎంకే నేతృత్వంలో వాడవాడలా వేడుకలకు సిద్ధమయ్యారు.