
ఆస్తుల పరిక్షణకు కమిటీ
● తంగబాలు నేతృత్వంలో ఏర్పాటు ● 31 మందికి చోటు ● టీఎన్సీసీ నిర్ణయం
సాక్షి, చైన్నె: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆస్తులను పరిరక్షించుకునేందుకు ఏఐసీసీ పెద్దలు కమిటీని రంగంలోకి దించారు. పార్టీ మాజీ అధ్యక్షుడు కేవీ తంగబాలు నేతృత్వంలో 31 మందితో కూడిన కమిటీని గురువారం టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై ప్రకటించారు. వివరాలు.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చైన్నెలో సత్యమూర్తి భవన్ రాష్ట్ర కార్యాలయంగా ఉంది. అలాగే తేనాంపేటలో కామరాజర్ అరంగం ఉంది. 200 గ్రౌండ్లస్థలంతో ఆడిటోరియం ఉంది. అలాగే చైన్నె నగరంలో సుమారు రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు సమాచారం. వీటితో పాటూ రాష్ట్రంలో మరో రూ. 2 వేల కోట్లు విలువగల ఆస్తులు పలు జిల్లాలో ఉన్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. కర్మయోగి కామరాజర్ సీఎంగా ఉన్న కాలంలో కాంగ్రెస్కు అప్పట్లో విరాళాలు అధికంగా వచ్చేవి. పార్టీ కార్యాలయాల కోసం భవనాలు, ఖర్చుల కోసం పంట పొలాలను, అందులో సాగుబడి అయ్యే ఉత్పత్తులను విరాళంగా ఇచ్చేన వారు ఎక్కువే. అయితే ఇందులో అనేకం అన్యాక్రాంతమై ఉన్నాయి. వీటిని గుర్తించి స్వాధీనం చేసుకుని, పరిరక్షించుకునేందుకు ఏఐసీసీ పెద్దలు సిద్ధమయ్యారు. అనేక ఆస్తులను పార్టీ వారే స్వాహా చేసి చేతులు మార్చినట్టుగా ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా నియమితులైన గిరిశీ చడన్కర్, ఏఐసీసీ కార్యదర్శి సూరజ్ ఎంఎన్ హెగ్డేలు ఇటీవల చైన్నెలో జరిగిన సమావేశంలో ఈ ఆస్తుల గురించి ఆరా తీశారు. ఉన్నవాటిని పరిరక్షించుకోవడం, అన్యాక్రాంతమైన వాటిని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టేవిధంగా అధిష్టానం పెద్దల దృష్టికి వివరాలను తీసుకెళ్లారు. ఈ ఆస్తుల పరిరక్షణకు గతంలో నియమించిన కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేశారు.
31 మందితో కమిటీ
ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా టీఎన్సీసీ కమిటీని ఆ పార్టీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై గురువారం ప్రకటించారు.మాజీ అధ్యక్షుడు తంగబాలు నేతృత్వంలో 31 మందిని ఈ కమిటీలో నియమించారు. ఇందులో సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎం కృష్ణ స్వామి, అళగిరి, రాజేష్కుమార్, చెల్లకుమార్, మాణిక్యం ఠాకూర్, కేఆర్ రామస్వామి, ఎస్ఎస్ఆర్ రామసుబ్బు, కె.రాణి, విశ్వనాథన్, క్రిష్టోఫర్ తిలక్, గోపీనాథ్, పళణియప్పన్, అరివలగన్, రూబి మనోహరన్, హసన్మౌలానా, తారగై, మెయ్యప్పన్, నాసే రామచంద్రన్, ఆర్ఎంపళణి స్వామి, ఎస్ఆర్ సుజాత, కె. విజయన్ బెన్నట్ అంతోని రాజ్, న్యాయవాదులు సూర్యప్రకాశం, ఓఎంఆర్ పళణి వేల్, రాజ్కుమార్, మాసిలామణి తదితరులు ఉన్నారు. ఈ కమిటీ తొలుత చైన్నెలో భేటీ కానుంది. తదుపరి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనుంది. ఆస్తుల గురించి సమగ్ర వివరాలతో నివేదికను సిద్ధం చేసి మూడు నెలలలో ఏఐసీసీ పెద్దలకు సమర్పించనుంది. కమిటీని రంగంలోకి దించినా, ఎప్పటి నుంచి అన్యాక్రాంతమైన ఆస్తులను స్వాధీనం చేసుకుంటారో అన్న గడువును ఏఐసీసీ పెద్దలు నిర్ణయించక పోవడాన్ని కాంగ్రెస్ వాదులు వ్యతిరేకిస్తున్నారు. నిర్ణీత గడువు విధించి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలే గానీ, కమిటీల, అధ్యయనం, పరిశీలన పేరిట మళ్లీ కాలయాపన చేసిన పక్షంలో ఉన్న ఆస్తులు కూడా కనుమరుగయ్యే పరిస్థితులు తప్పవని పేర్కొంటున్నారు.