
కలైంజ్ఞర్ వర్సిటీ కోసం స్థలం పరిశీలన
●కుంబకోణంలో మంత్రి కోవి చెలియన్ బృందం పర్యటన
సాక్షి, చైన్నె: కలైంజ్ఞర్ వర్సిటీ ఏర్పాటు పనులు వేగం పుంజుకున్నాయి. మరికొన్ని నెలలో కుంభకోణంలో కలైంజ్ఞర్ వర్సిటీ ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన స్థల పరిశీలనలో ఉన్నత విద్యామంత్రి కోవి చెలియన్ నిమగ్నమయ్యారు. తమిళనాడులో తమిళ కవులు తిరువళ్లువర్, భారతీయార్, భారతీ దాసన్ల పేరిట వర్సిటీలు ఉన్నాయి. అలాగే, ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్, ఈ రాష్ట్రాన్ని పాలించిన సీఎంలు కర్మయోగి కామరాజర్, ఎంజీఆర్, జయలలిత పేరిట సైతం విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అదే సమయంలో డీఎంకే దివంగత నేత కలైంజ్ఞర్ కరుణానిధి పేరిట వర్సిటీని నెలకొల్పేందుకు అసెంబ్లీ వేదికగా సీఎం స్టాలిన్ ప్రకటన చేశారు. నాటి తిరువారూర్, తంజావూరు జిల్లాలలో ప్రధాన కేంద్రంగా ఉన్న కుంభకోనంను ఈ వర్సిటీకి వేదికగా ఎంపిక చేశారు. ఈ వర్సిటీకి సంబంధించిన చట్టం సైతం అసెంబ్లీ ఆమోదం పొందింది. దీంతో వర్సిటీ స్థల పరిశీలన ప్రక్రియపై ఉన్నత విద్యామంత్రి కోవి చెలియన్ దృష్టి పెట్టారు. గురువారం కుంబకోణంలో ఆయన పర్యటించారు. కుంబకోణంలోని పలు కళాశాలలు, అక్కడి వసతలును పరిశీలించారు. ఈ వర్సిటీ పరిధిలో నాగపట్నం, తంజావూరు, తిరువారూర్, అరియలూరు జిల్లాలకు చెందిన కళాశాలలు అన్నీ చేరనన్నడంతో అందుకు తగిన వసతులు, నిర్మాణాలు , ఏర్పాట్లకు సంబంధించిన కసరత్తులపై దృస్టి పెట్టారు. కలెక్టర్ ప్రియాంక పంకజం, ఎంపీ కల్యాణ సుందరం, ఎమ్మెల్యే అన్బళగన్ తదితరులు ఈ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన స్థల సేకరణను త్వరగతిన ముగించి, కలైంజ్ఞర్ వర్సిటీ అన్న బోర్డు ఏర్పాటుతో పాటుగా ఇతర నిర్మాణాలను వేగవంతం చేసే విధంగా ఉరకలు తీస్తున్నారు.