
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం
కుమారుడి మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
అన్నానగర్: కోటగిరి సమీపంలో కొడుకు మృతి చెందాడనే బాధను తట్టుకోలేక తండ్రి మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. నీలగిరి జిల్లా కోటగిరి సమీపంలోని బర్న్సైడ్ అన్నానగర్ గ్రామానికి చెందిన అర్జున్ (52) కూలి. ఇతని కుమారుడు మణికంఠన్ (24). ఇతను తేయాకు ఫ్యాక్టరీలో టీ మేకర్గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మణికంఠన్ 18వ తేదీ రాత్రి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడి మరణంతో అర్జున్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ స్థితిలో మంగళవారం అర్జునన్ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోటగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చెరువులో మునిగి
ఇద్దరు మృతి
వేలూరు: చెరువులో మునిగి ఇద్దరు మృతిచెందారు. తిరువణ్ణామలై జిల్లా కరువంబాడి గ్రామానికి చెందిన తిరువెంగడం(30) మేకలు మేపుకుని జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రమేష్(40) ఇటుకల బట్టీలో కార్మికుడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం కరువంబాడి గ్రామ సమీపంలోని చెరువులో తిరువెంగడం మేకలు మేపుకుంటున్నాడు. సాయంత్రం 5 గంటలకు పైన అతను అదృశ్యమయ్యాడు. దీంతో బంధువులు, గ్రామస్తులు చెరువులో దిగి గాలించారు. ఆ సమయంలో చెరువులోని బురదలో చిక్కుకొని తిరువెంగడం మృతదేహాన్ని బయటకు తీశారు. అదే నీటిలో మునిగిన ఒక మేక పిల్లను బయటకు తీశారు. ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన రమేష్ కూడా కనిపించలేదని కుటుంబ సభ్యులు అదే చెరువులో గాలించారు. చెరువు మృతదేహంగా కనిపించాడు. గ్రామస్తులు తిరువణ్ణామలై పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తిరువెంగడం, రమేష్ మృతదేహాలను పోస్టుమార్టంకు తిరువణ్ణామలై ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చెరువులో మునిగిన మేక పిల్లను కాపాడేందుకు తిరువెంగడం నీటిలో మునిగిన విషయాన్ని గమనించిన రమేష్ కాపాడేందుకు నీటిలో దిగి మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. వీటిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
చేపల వేటకు
వెళ్లి జాలరి మృతి
తిరువళ్లూరు: చేపల వేటకు వెళ్లిన జాలరి రెండు రోజుల తరువాత శవమై తేలిన సంఘటన పుల్లరంబాక్కంలో విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా పుల్లరంబాక్కం గ్రామానికి చెందిన శ్రీనివాసన్(58). పూండి రిజర్వాయర్లో చేపల వేట ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నా డు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు చేపల వేటకు వెళ్లిన శ్రీనివాసన్ సోమవారం ఉదయం వరకు ఇంటికి తిరిగిరాలేదు. ఆందోళన చెందిన బంధువులు పుల్లరంబాక్కం పోలీసులకు, తిరువళ్లూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలించినా ఫలితం లేకపోయింది. చీకటి పడడంతో మంళవారం రెండవ రోజు గాలింపు చర్యలు చేపట్టి మద్యాహ్నం మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం శవపరిక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనపై పుల్లరంబాక్కం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చేపల వేటకు వెళ్లిన వ్యక్తి శవమై తేలిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
ఎర్రచందనం స్వాధీనం
పళ్లిపట్టు: ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఆంధ్రా సరిహద్దులోని పళ్లిపట్టులో తమిళనాడుకు ఎర్రచందనం రవాణా జరుగుతోంది. ఈ క్రమంలో కొడివలస కాలనీకి సమీపంలోని కొండ ప్రాంతంలో కారు ఆగివున్నట్లు అందులో ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు సమాచారం అందింది. పొదటూరుపేట ఎస్ఐ ఇళంగో సంఘటన ప్రాంతం చేరుకుని కారును పరిశీలించగా అందులో అరటన్ను ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకుని పళ్లిపట్టు అటవీశాఖ అధికారులకు అప్పగించారు.
వాహనం ఢీకొని గుర్రం మృతి
అన్నానగర్: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ గుర్రం మృతిచెందింది. తంజావూరు – తిరుచ్చి రోడ్డులోని కొత్త బస్టాండ్ సమీపంలో మంగళవారం రోడ్డుపై తిరుగుతున్న గుర్రాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో గుర్రం అక్కడికక్కడే మృతిచెందింది. కార్పొరేషన్ కమిషనర్ శరవణకుమార్ ఆదేశాల మేరకు హెల్త్ ఇన్స్పెక్టర్ స్టీఫెన్, కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులు చనిపోయిన గుర్రం మృతదేహాన్ని తొలగించారు.

శ్రీనివాసన్ (ఫైల్)