
మెరుగైన వైద్య సేవలు అందించాలి
చివ్వెంల(సూర్యాపేట): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మంగళవారం చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ బస్తీ దవాఖానాను తనిఖీ చేశారు. హాస్పిటల్ రికార్డులు పరిశీలించి, సిబ్బంది వివరాలను వైద్యాధికారి అనిషాను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది చేస్తున్న వైద్యం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మందులు కావాలంటే వైద్య సిబ్బంది ముందుగానే సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిషా, ల్యాబ్ టెక్నీషియన్ రేవతి, స్టాఫ్నర్సు రమాదేవి పాల్గొన్నారు.