
వైభవంగా గరుడ వాహనసేవ
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. కల్యాణం అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహన సేవపై ఆలయ తిరుమాడ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, భక్తులు పాల్గొన్నారు.
బీజేపీని బలోపేతం చేయాలి
మునగాల : పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అన్నారు. మునగాల మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు మైలారుశెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. యువతను పార్టీలో చే ర్పించాలని, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనంతరం మండల నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సీనియర్ నాయకులు భద్రంరాజు కృష్ణప్రసాద్, సాతులూరి హనుమంత్, జనార్దన్, రమేష్, జోగయ్య, సురేందర్రెడ్డి, సైదులు పాల్గొన్నారు.
నేడు శాలిగౌరారం ప్రాజెక్టు నీటి విడుదల
శాలిగౌరారం : శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి ప్రస్తుత వానాకాలం పంటల సాగుకు ఆదివారం నీటి విడుదల చేయనున్నట్లు నీటిపారుదలశాఖ డీఈ సత్యనారాయణ శనివారం సాయంత్రం తెలిపారు. నీటి విడుదల కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్కుమార్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, రైతుప్రతినిధులు హాజరు కావాలని కోరారు. కాగా.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా.. ప్రస్తుతం 18 అడుగుల మేర నీరు ఉంది.

వైభవంగా గరుడ వాహనసేవ