
ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలి
సూర్యాపేట : ఆపరేషన్ కగార్ పేరిట సాగిస్తున్న హత్యకాండను వెంటనే ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని ఎంవీఎన్ భవన్లో ఏర్పాటు చేసిన వామపక్ష పార్టీల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల వరుస కాల్పుల కారణంగా ఛత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా 27మందిని ఎన్కౌంటర్ చేయడం దారుణ చర్య అన్నారు. అది మరువక ముందే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ను దారుణంగా కాల్చి చంపారని ఆరోపించారు. ఈ ఘటనను వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. చర్చలకు తాము సిద్ధమేనని మావోయిస్టులు పదేపదే చేసిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి శోచనీయమన్నారు. పైగా ప్రధాని, హోంమంత్రి ఎన్కౌంటర్పై హర్షం వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. జూన్ 9న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంసీపీ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న, సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, మట్టిపెల్లి సైదులు, కోట గోపి, గంట నాగయ్య తదితరులు పాల్గొన్నారు.