
‘భూ భారతి’తో మెరుగైన సేవలు
నూతనకల్ : భూ భారతి చట్టం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందుతాయని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శుక్రవారం నూతనకల్ మండలం తాళ్లసింగారం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. అనంతరం సోమ్లాతండాలో రేషన్ దుకాణంలో రికార్డులు, వన నర్సరీలను పరిశీలించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సమయపాలన పాటిస్తూ బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ పండ్ల మొక్కలు అందించేలా స్థానిక సిబ్బంది పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నూతనకల్ తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శిలు పాల్గొన్నారు.