
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
భానుపురి (సూర్యాపేట) : నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేట మార్కెట్లోని ఎరువుల దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్తీ విత్తనాలు అరికట్టి నాణ్యమైన ఎరువులు, విత్తనాలు రైతులకు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రైతులకు వానాకాలం సీజన్కు సరిపడా కాంప్లెక్స్ ఎరువులు, యూరియా, యన్పీకే లాంటి ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ఏ రకం పత్తి విత్తనాలపై ఆసక్తి చూపిస్తున్నారనే విషయాన్ని ఆరా తీశారు. గుర్తింపు పొందిన డీలర్లు ఈ పాస్ మిషన్ ద్వారానే ఎరువులు విక్రయించాలని సూచించారు. కల్తీ విత్తనాలు అరికట్టేందుకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు గుర్తింపు పొందిన డీలర్ల వద్దే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి, ఆర్డీఓ వేణుమాధవ్, ఎంపీడీఓ, మండల వ్యవసాయ అధికారులు గణేశ్, కృష్ణ సందీప్ ఇతర అధికారులు ఉన్నారు.