
ముగిసిన ఈఏపీ సెట్
అనంతగిరి: అనంతగిరి మండల కేంద్రంలో గల అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈఏపీ సెట్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. రెండవ రోజు నిర్వహించిన పరీక్షకు 200 మంది అభ్యర్థులకు గాను 190మంది హాజరు కాగా 10మంది గైర్హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.సురేష్కుమార్ తెలిపారు.
జూన్ 3 నుంచి 13 వరకు పదో తరగతి సప్లిమెంటరీ
సూర్యాపేటటౌన్ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 16వ తేదీ వరకు ఎలాంటి అపరాద రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించ్చని సూచించారు. రూ.50 అపరాద రుసుంతో ప్రతి పరీక్షకు రెండు రోజుల ముందు వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 రుసుం చెల్లించి రీకౌంటింగ్ చేసుకోవచ్చని సూచించారు. రీ వెరిఫికేషన్ కోసం ఆన్సర్ బుక్కావాల్సిన విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాలని తెలిపారు. ఈ రుసుంను ఫరీక్ష ఫలితాల నుంచి 15రోజుల్లోగా ట్రెజరీ చలాన్ ద్వారా చెల్లించాలని సూచించారు. చలానా, హాల్ టికెట్ కాపీ జత పరిచి ఆ దరఖాస్తులను సంబంధిత ప్రధానోపాధ్యాయులతో సంతకం చేయించి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని కోరారు.
నేటి నుంచి ఎంజీయూకు వేసవి సెలవులు
నల్లగొండ టూటౌన్: మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని అన్ని కాలేజీలు, యూనివర్సిటీ పరిధిలోని పీజీ, బీఈడీ, ఎంఈడీ కాలేజీలకు గురువారం నుంచి ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించినట్లు యూనివర్సిటీ రిజిస్టార్ అల్వాల రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, డిగ్రీ కళాశాల యాజమాన్యాలు గమనించాలని కోరారు.
ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు
సూర్యాపేట : నీటి పారుదల శాఖ సూర్యాపేట సర్కిల్ ఈఈగా సూర్యాపేట డిప్యూటీ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎన్. వెంకట రమణకు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.