
రాత్రివేళ తెరిచి ఉన్న జీఎస్టీ కార్యాలయం
కోదాడ: కోదాడ పట్టణంలోని జీఎస్టీకార్యాలయం రాత్రివేళ తెరిచిఉండడం.. అధికారులు విధులు నిర్వహించడం.. ఆఫీస్ ఎదుట అధికారి వాహనం ఉండడం చర్చనీయాంశమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. కోదాడ పట్టణంలో ప్రధాన రహదారిపై జీఎస్టీ కార్యాలయం ఉంది. గురువారం తెల్లవారుజామున 4.15 గంటలకు ఆఫీస్కు సొంత వాహనంలో వచ్చిన అధికారి లోపలికి వెళ్లి గడియపెట్టుకున్నట్లు తెలిసింది. తెల్లవారే వరకు కార్యాలయంలోనే ఉన్నారని సమాచారం. అర్ధరాత్రి నుంచి అధికారి వాహనం కార్యాలయం ముందే ఉందని తెల్సుకున్న కొందరు 4 గంటలకు అక్కడికి వచ్చి చూసినట్లు సమాచారం. కార్యాలయం తాళం తీసి ఉండడమే కాకుండా లోపల గడియ పెట్టుకొని ఉండడంతో దాన్ని ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. కోదాడకు చెందిన కొందరు జీఎస్టీ అధికారులు అర్ధరాత్రి రామాపురం క్రాస్రోడ్డు వద్ద అనధికార తనిఖీలు నిర్వహించి రెండు లారీలను పట్టుకున్నారని, వారి నుంచి భారీగా వసూలు చేసి కార్యాలయానికి చేరుకున్నారని, పంపకాల్లో తేడాలు రావడంతో వారిలో కొందరు ఈ ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టినట్లు ఇక్కడ ప్రచారం సాగుతోంది. జీఎస్టీ అధికారికి ప్రభుత్వం ప్రతినెలా వాహన అలవెన్స్ చెల్లిస్తున్నా సొంత వాహనాన్ని అద్దె వాహనంగా చూపి బిల్లులు డ్రా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. దీనిపై స్థానిక అధికారులు మాత్రం ఇది డ్యూటీలో భాగమేనని, ప్రత్యేకం ఏమీ లేదని స్పష్ట చేస్తున్నారు. డ్యూటీలో భాగంగా బాత్రూం కోసం కార్యాలయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
ఫ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు
ఫ కోదాడలో చర్చనీయాంశం

రాత్రివేళ తెరిచి ఉన్న జీఎస్టీ కార్యాలయం