
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
సూర్యాపేటటౌన్ : దక్షిణ భారతదేశంలో మరో కుంభమేళాగా వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాటల కోసం అన్ని వర్గాల ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాడని, ఇప్పుడు సభలో ఏం చెబుతాడో, తమకు ఏం భరోసా ఇస్తాడో అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, రైతుల పంటలకు నీళ్లు ఇవ్వకపోవడంతో అవి పూర్తిగా ఎండిపోయాయని, పండిన కొద్ది పంటను కొనక రైతులు తగులబెట్టి నిరసన వ్యక్తం చేస్తూ మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారన్నారు. నాడు 14 ఏళ్లు ఉద్యమం చేసినా, పదేళ్లపాటు అభివృద్ధి చేసినా, నేడు 16 నెలలు ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ పని చేస్తుందని చెప్పారు. సభకు సూర్యాపేట జిల్లా నుంచి 40 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ సభకు పయనమైన రైతుల ఎడ్ల బండ్లకు గ్రామగ్రామాన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సమావేశంలో గ్రంథాయ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, నెమ్మాది భిక్షం, జిడి భిక్షం, బొమ్మ గాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఫ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్