
చాడలో బౌద్ధ చరిత్ర
ఫ గతేడాదిగా పురావస్తు శాఖ తవ్వకాలు
ఫ పెద్ద ఎత్తున బయటపడుతున్న
బౌద్ధం ఆనవాళ్లు
ఫ ఏడు రోజుల క్రితం తవ్వకాల
పనులను పరిశీలించిన
కొత్త తెలంగాణ చరిత్ర బృందం
ఏడు రోజుల క్రితం చాడ గ్రామాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ కో–కన్వీనర్ భద్రగిరీష్, సభ్యులు ఎం. రవి, కుండె గణేష్, ఎండీ ఇమ్రాన్ సందర్శించారు. తవ్వకాల్లో బయటపడుతున్న పురాతన సంపదను పరిశీలించారు. తవ్వకాలు నిర్వహిస్తున్న వారిలో తెలంగాణ వారసత్వశాఖ అధికారులు పి. నాగరాజు, సాగర్, పూణా దక్కన్ కాలేజీ ప్రొఫెసర్ ఘన్వీర్ శ్రీకాంత్, ఇతర సిబ్బంది ఉన్నారు. తవ్వకాల్లో దాదాపు 80మంది పాల్గొంటున్నారు.
చాడను సందర్శించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం
తవ్వకాలను పరిశీలిస్తున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చాడ గ్రామంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి తర్వాత అతిపెద్ద బౌద్ధ స్థూపం ఆనవాళ్లు ఇక్కడ వెలుగు చూస్తున్నాయి. ఇందులో బుద్ధ విగ్రహాలు, శిల్పాల శకలాలు, మట్టిపూసలు, బొక్కగాజులు, శాతవాహన కాలం నాటి డిజైన్న్ పెంకులు, పొడవైన పెద్ద ఇటుకలు, బౌద్ధ విహార గోడలు బయల్పడుతున్నాయి.
2003లోనే గుర్తింపు..
2003లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చాడ గ్రామంలో బౌద్ధం ఆనవాళ్లు గుర్తించింది. అంతేకాకుండా 2010లో గ్రామానికి చెందిన భూమయ్యగౌడ్ పొలం దున్నుతుండగా పురాతన విగ్రహం ఒకటి బయటపడింది. దీంతో పురాతన చరిత్రను బయటకు తీయడానికి పురావస్తు శాఖ పూనుకుంది. ఈ గ్రామంలో ఎన్నో బౌద్ధ మత ఆనవాళ్లు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు వాటిని దేవతామూర్తులుగా పూజిస్తారు. 2024లో చాడ గ్రామంలో ఆర్కియాలజీ శాఖ తవ్వకాలకు శ్రీకారం చుట్టింది. భూమయ్యగౌడ్కు చెందిన రెండు ఎకరాల్లో ఈ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం వేసవిలో చేసిన విధంగానే ఈసారి కూడా ఆర్కియాలజీ శాఖ అధికారులు, విద్యార్థులు తవ్వకాలను పరిశీలిస్తున్నారు. గ్రామానికి చెందిన కూలీలతో తవ్వకాలు ప్రారంభించారు. దొరికిన ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలించి భద్రపరుస్తున్నారు.
గతేడాది బయటపడిన శాసనం
2024లో జరిపిన తవ్వకాల్లో బ్రహ్మీ లిపిలో ఉన్న శాసనం బయటపడింది. ఈ శాసనంలో చాడ పేరు సదరిక అని ఉంది. సదరిక క్రమంగా వాడుకలోంచి చాడగా మారిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. చాడ శాసనం గురించిన వివరాలు ఎపీగ్రఫీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కె. మునిరత్నంరెడ్డి గతంలోనే వెల్లడించారు.
బిక్కేరు వాగు బౌద్ధం నుంచే..
ఆలేరు వాగు కాస్తా చాడ వరకు వచ్చేసరికి బిక్కేరు వాగుగా మారుతుంది. అప్పట్లో బౌద్ధ భిక్షువులు ఉండే ప్రాంతం కావడంతో ఈ ప్రాంతానికి బిక్కేరు అని పేరు వచ్చింది. అలాగే ఇక్కడ లభించిన నిలబడి ఉన్న బౌద్ధ విగ్రహం నల్లగొండలోని పానగల్ మ్యూజియంలో ఉంది. 2024 నుంచి జరుపుతున్న తవ్వకాల్లో మరికొన్ని విగ్రహాలు దొరికినా వాటి వివరాలు ఆర్కియాలజీ శాఖ అధికారులు బయటకు చెప్పడం లేదు. ఇక్కడ లభిస్తున్న వస్తువులు, మట్టిపొరలు, గాజులు, పూసలు, విగ్రహాలు, నాణేలు తదితర బౌద్ధం ఆనవాళ్లను ఆర్కియాలజికల్ విద్యార్థులు గ్రేడింగ్ ఇస్తున్నారు. గతంలో ఇక్కడ ఉన్న బౌద్ధ స్థూపానికి సంబంధించిన ఇటుకల కుప్పలు ఇప్పుడు లేవు. ప్రస్తుతం అవి చెదిరిపోయాయి. తవ్వకాల్లో ఇంకా బౌద్ధ శిల్పాలు బయటపడే అవకాశం ఉంది. ఎకరం రెండు ఎకరాల్లో కాకుండా ఎక్కువ విస్తీర్ణంలో తవ్వకాలు జరిగితే మరింత చరిత్ర బయటపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఫణిగిరిలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ బౌద్ధం ఆనవాళ్లను అక్కడే భద్రపరిచారు. అయితే చాడలో లభిస్తున్న వాటిని ఇక్కడే భద్రపర్చాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి చరిత్ర మరో ప్రాంతానికి తరలిపోకుండా ఇక్కడే మ్యూజియం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తవ్వకాలు పూర్తయిన తర్వాత విడుదల చేసే సంపూర్ణ నివేదిక వచ్చినప్పుడు ఇక్కడి ప్రాముఖ్యత, విశిష్టత వెలుగు చూస్తుందని పురావస్తుశాఖ అధికారులు అంటున్నారు.
గాంధార శిల్ప సంపద
ఇక్కడ దొరికిన బౌద్ధ శిల్పాలలో గాంధార శైలికి చెందిన బుద్ధుడి స్థానక భంగిమ శిల్పాలు, అర్ధ శిల్పాలు, బుద్ధ విగ్రహాల తలలు, విగ్రహాల శకలాలు, క్రీ.పూ. 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దపు నాణేలు, టెర్రకోట బొమ్మలు, దంతపు గాజుల ముక్కలు, శాతవాహన కాలం నాటి కుండ పెంకులు, శాతవాహనకాలం నాటి ఇటికెలు, పూసలు అనేకం వెలుగుచూస్తున్నాయి.

చాడలో బౌద్ధ చరిత్ర

చాడలో బౌద్ధ చరిత్ర

చాడలో బౌద్ధ చరిత్ర

చాడలో బౌద్ధ చరిత్ర