
హనుమాన్ జయంతికి పోలీస్ భద్రత
సూర్యాపేటటౌన్ : హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం భక్తుల సౌకర్యార్థం జిల్లాలో కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్ణీత సమయంలో కార్యక్రమాలు ముగించుకోవాలన్నారు. ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో ఒకరినొకరు గౌరవించుకుంటూ జరుపుకోవాలన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడి అవగాహన కల్పించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీసు శాఖ తరఫున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతిఒక్కరూ మొక్కలను కాపాడాలి
సూర్యాపేట అర్బన్ : ప్రతిఒక్కరూ మొక్కలను కాపాడాలని అదనపు కలెక్టర్, సూర్యాపేట మున్సిపల్ ప్రత్యేక అధికారి పర్స రాంబాబు అన్నారు. శుక్రవారం వాటరింగ్ డే ను పురస్కరించుకుని సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెరువు కట్టపై మొక్కలకు ఆయన నీరు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవికాలంలో మొక్కలకు నీరు పోసి కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బోళ్ల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఎస్.ఎస్.ఆర్.ప్రసాద్, వసుంధర, వసీం తదితరులు పాల్గొన్నారు.
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
గరిడేపల్లి : అభివృద్ధి, సంక్షేమం బీజేపీతోనే సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండల పరిధిలోని సర్వారం గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు కుక్కడపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన గావ్ చలో..బస్తీ చలో అభియాన్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గావ్ చలో..బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలు ప్రతి గ్రామంలోని వార్డుల్లో సమస్యలను గుర్తించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన వక్ఫ్బోర్డు సవరణల వల్ల పేద ముస్లింలకు కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ నర్సింగ్ అంజయ్య, పొలిశెట్టి అంజయ్య, జెనిగల శ్రీను, చిత్తలూరు సోమయ్య, చంద్రశేఖర్రెడ్డి, తాళ్ల సురేష్, గుండు బాలకృష్ణ, రామకృష్ణ, కందుల వెంకటరెడ్డి, రాజు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం ఆరబెట్టి
కేంద్రాలకు తీసుకురావాలి
భానుపురి (సూర్యాపేట) : మార్కెట్ యార్డుకు రైతులు ఆరబెట్టిన ధాన్యం తీసుకురావాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి సంతోష్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మార్కెట్కు 25వేల బస్తాల ధాన్యం వచ్చిందని, రూ.2329 గరిష్ట, రూ.1500 కనిష్ట ధర పలికిందన్నారు. లైసెన్స్ కలిగిన వ్యాపారులు రైతుల ధాన్యం కుప్పలో తేమ శాతం, తాలు, చెత్త పరిశీలించిన తర్వాత ధర నిర్ణయిస్తారని తెలిపారు. మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన రైతు బత్తిని లింగరాజు 40 బస్తాల ధాన్యం తీసుకురాగా.. నాణ్యత ప్రమాణాల మేరకు రూ.1606 ధరను ఖరీదుదారులు చెల్లించేందుకు ముందుకు వచ్చారన్నారు. ధర ఎక్కువ కావాలని రైతు కోరగా.. తాలు, తేమ ఎక్కువగా ఉండడంతో ఖరీదుదారులు అంత ధర చెల్లించలేమన్నారని పేర్కొన్నారని అన్నారు. చుట్టుపక్కల రైతులు, లింగరాజు కలిసి చెట్ల ఆకులను ధాన్యం రాశి వద్దకు తీసుకొచ్చి నిప్పంటించారన్నారు. తేమశాతం 22 ఉందని, ధాన్యాన్ని ఆరబెడితే ధర అధికంగా చెల్లించే అవకాశం ఉందని అధికారులు తెలపడంతో రైతు అంగీకరించి శనివారం ధాన్యం అమ్ముకుంటానని చెప్పాడన్నారు. మార్కెట్కు నిత్యం కొందరు కావాలనే మార్కెట్ కమిటీని అభాసుపాలు చేయాలని చూస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, రైతులు అధైర్య పడకుండా ధాన్యం తీసుకురావాలని సూచించారు.

హనుమాన్ జయంతికి పోలీస్ భద్రత