
నవ్విపోదురు గాక..
● ఉద్దానం తాగునీటి పథకం రెండోదశ పనులకు రెండోసారి శంకుస్థాపన ● గత ఏడాదే ఈ పనులకు శ్రీకారం చుట్టిన అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ● మళ్లీ ఆ పనులకే శంకుస్థాపన చేయడంపై విమర్శలు
పాతపట్నం/హిరమండలం:
వైఎస్సార్ సుజల ధార ఉద్దానం ప్రాజెక్ట్.. వైఎస్ జగన్ ప్రభుత్వం రూపకల్పన చేసి, నిధులు విడుదల చేసి, పనులు పూర్తి చేసిన ప్రాజెక్టు. దశాబ్దాల తరబడి జిల్లాను పాలిస్తున్న వారు కలలో సైతం ఊహించని రీతిలో వైఎస్సార్ సీపీ సర్కారు ఉద్దానం గ్రామాల ప్రజల కోసం ఈ ప్రాజెక్టును పూర్తి చేసి చూపించింది. ఇదే ప్రాజెక్టుకు అనుసంధానంగా పాతపట్నం నియోజకవర్గంలోని 444 గ్రా మాలకు తాగునీరు అందించేందుకు పథకం విస్తరణకు సైతం శ్రీకారం చుట్టింది. అప్పట్లోనే శంకుస్థాపన కూడా జరిగింది. సరిగ్గా అవే పనులకు కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం మళ్లీ శంకుస్థాపన చేయడం హాస్యాస్పదంగా మారింది.
భగీరథ ప్రయత్నం..
కిడ్నీ వ్యాధులతో బాధ పడుతున్న ఉద్దానం ప్రజల కోసం రూ.700 కోట్లతో ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కరోనా కష్టకాలం ఎదురువచ్చి నా అన్నింటినీ దాటుకుని ఉద్దానం వరకు వంశధారను తీసుకువచ్చింది. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు భగీరథ ప్రయత్నమే చేసింది.
రూ.265 కోట్లతో పాతపట్నానికి..
హిరమండలం వద్ద ఉన్న వంశధార రిజర్వాయర్ నుంచి జలాలను తరలించి శుద్ధి చేసి నీటిని అందించాలన్నది ఈ పథకం లక్ష్యం. పాతపట్నంకు కూడా ఈ నీటిని అందించేందుకు అప్పటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి వైఎస్ జగన్ను ఒప్పించారు. ఆమె అడిగిందే తడవుగా పథకం విస్తరణకు రూ.265 కోట్లు విడుదల చేశారు. దీంతో 2024 ఫిబ్రవరి 19న అప్పటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు శంకుస్థాపన చేసి పను లు కూడా ప్రారంభించారు. ఇంతలో ఎన్నికలు వ చ్చి ప్రభుత్వం మారిపోయింది. ఏడాదిగా ఈ పను ల ఊసేలేదు. కానీ ఇప్పుడు అవే పనులకు మళ్లీ శంకుస్థాపన చేయడం విమర్శలకు తావిస్తోంది.
జెడ్పీ చైర్ను అవమానించారు..
‘జిల్లా పరిషత్ నుంచే ఆర్డబ్ల్యూఎస్ పథకాలకు నిధులిస్తున్నాం. ఉద్దానం ప్రాజెక్టుకై తే జగనన్న ప్రభుత్వ హయాంలో రూ.700 కోట్లతో హిరమండలం నుంచి ఏకంగా ఉద్దాన ప్రాంతానికి ఇంటింటికీ తాగునీరు అందించాం. కానీ ఇప్పుడు అధికారులు నాకు కనీసం సమాచారం ఇవ్వకుండా కొత్తగా శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇలా ప్రొటోకాల్ ఉల్లంఘించడం నన్ను అవమానించడం కాదు.. జెడ్పీ చైర్ను అవమానించడం.’ అని జెడ్పీ చైర్ పర్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె ఇలా స్పందించారు. పాతపట్నం నియోజకవర్గానికి హిరమండలం నుంచి రూ.265 కోట్లతో మంచినీటిని అందించే పనులకు గతంలోనే శంకుస్థాపన చేయించామని, మళ్లీ ఇవే పనులకు ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్లు మళ్లీ శంకుస్థాపనకు సిద్ధమయ్యారని విమర్శించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా తనకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమాచారం ఇవ్వకపోవడం ఏమాత్రం సరికాదన్నారు.

నవ్విపోదురు గాక..