పెనుకొండ రూరల్: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. ఆదివారం తన భర్త చరణ్ రెడ్డితో కలసి రాంపురం పంచాయతీలోని కొండంపల్లిలో ఆమె పర్యటించారు. పార్టీ కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందన్నారు. ఇటీవల రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుచరులు ఓ మహిళపై నడిరోడ్డుపైనే పోలీస్ లాఠీతో దాడి చేయడం చూస్తే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. కాకినాడ జిల్లాలో దళిత మహిళపై జనసేన నేతలు దాడి చేసినా ఎటువంటి చర్యలూ లేవన్నారు. గతంలో టీడీపీకి 23 సీట్లు వచ్చిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. 164 సీట్లు గెలిచామంటున్న టీడీపీ నేతలు మెడికల్ కళాశాల నిర్మాణాలను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం కుట్టు శిక్షణ పేరిట మహిళలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఎటువంటి మెటీరియల్ అందించకుండా రోజులో గంట మాత్రమే శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోందన్నారు. కూటమి పార్టీల నాయకులు ప్రతి గ్రామంలో బెల్టు షాపులు ఏర్పాటు చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ప్రజలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొంది గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అసెంబ్లీ సాక్షిగా అనడం దుర్మార్గమన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి మంత్రికి లేదన్నారు. మంత్రి సవిత తాను దత్తత తీసుకున్న సొంత పంచాయతీలో ఎంత మేర అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తమ పార్టీ కార్యకర్తలు బెదిరిపోరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, మాజీ మండల కన్వీనర్లు నాగళూరు బాబు, శ్రీకాంత్ రెడ్డి, నాయకులు వైశాలి జయశంకర్ రెడ్డి, నారాయణ యాదవ్, చెన్నకేశవులు, భూమా నాగిరెడ్డి, చెన్నా రెడ్డి, బైపు రెడ్డి, శ్రీరాము రెడ్డి, గోపాల్ రెడ్డి, జి. నాగరాజు, శివ శంకర్, మల్లికార్జున రెడ్డి, వెంకటరెడ్డి, సతీష్, హరి, సమర, రవి వెంకటేషులు, చిన్న ఆంజనేయులు, టెంపో శీనా, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మండిపాటు


